త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ.. సీఎం రేవంత్ విజన్‌పై హిమాచల్ మంత్రి ప్రశంసలు

త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ.. సీఎం రేవంత్ విజన్‌పై హిమాచల్ మంత్రి  ప్రశంసలు

జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు .సచివాలయంలో  సీఎం రేవంత్ ను హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం  మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను  హిమాచల్ ప్రదేశ్ మంత్రికి వివరించారు సీఎం రేవంత్. 

ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్  చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు.   రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్న వివరాలను, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో ఈ స్కూల్స్‌ను నిర్మిస్తున్నట్టు సీఎం చెప్పారు.

ఏటీసీగా మార్చిన మల్లేపల్లి (ఐటీఐ)ని సందర్శించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ హిమాచల్‌ప్రదేశ్ మంత్రికి సూచించారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపైన ఆసక్తి చూపించిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి  అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు.  ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న  సీఎం రేవంత్ విజన్‌ను రోహిత్ ఠాకూర్ అభినందించారు.