
- ధరలు పెరగడమే కారణం..అనరాక్ రిపోర్ట్ వెల్లడి
- దేశంలోని టాప్ 7 సిటీల్లో 11 శాతం పెరిగిన ఇండ్ల ధరలు
న్యూఢిల్లీ: ఇండ్ల ధరలు పెరగడంతో వీటి అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ క్వార్టర్ (క్యూ1) లో పడిపోయాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. టాప్ ఏడు నగరాల్లో ఇంటి ధరలు ఏడాది లెక్కన క్యూ1 లో 11శాతం పెరిగాయని, దీనివల్ల సేల్స్ 20శాతం తగ్గాయని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, జూన్ క్వార్టర్లో హౌసింగ్ సేల్స్ 96,285 యూనిట్లుగా నమోదయ్యాయి.
గత ఏడాది ఇదే సమయంలో ఇవి 1,20,335 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ-–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోల్కతాలో సేల్స్ తగ్గాయి. చెన్నైలో మాత్రమే డిమాండ్ పెరిగింది. ఈ వారం మొదట్లో ప్రాప్ఈక్విటీ డేటా కూడా ఈ క్వార్టర్లో సేల్స్ 19శాతం తగ్గుతాయని అంచనా వేసింది.
డిమాండ్ తగ్గడానికి కారణాలు..
అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ, “2025 జూన్ క్వార్టర్లో భారత హౌసింగ్ మార్కెట్ తీవ్రఒడిదుడుకులను చూసింది. జియోపొలిటికల్ టెన్షన్లు, పాకిస్తాన్–ఇండియా ఉద్రిక్తతల వలన ఇంటి కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అనుసరించారు.
గత రెండేళ్లలో ఆస్తి ధరలు బాగా పెరగడం కూడా దీనికి తోడైంది” అని అన్నారు. జియో పొలిటికల్ టెన్షన్లు తగ్గడం, ఆర్బీఐ రెపో రేట్ కోత వల్ల ఇండ్ల అమ్మకాలు ఊపందుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏడు నగరాల్లో సగటు రెసిడెన్షియల్ ధరలు ఏడాది లెక్కన 11 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో అత్యధికంగా 27శాతం పెరిగాయి. బెంగళూరులో 12శాతం, హైదరాబాద్లో 11శాతం పెరిగాయి.
అమ్మకాలు ఇలా..
ఢిల్లీ–ఎన్సీఆర్: కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇండ్ల అమ్మకాలు 14 శాతం తగ్గి 16,550 యూనిట్ల నుంచి 14,255 యూనిట్లకు పడిపోయాయి.
ముంబై: ఈ సిటీలో ఇండ్ల సేల్స్ 25శాతం తగ్గి 31,275 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే టైమ్లో 41,540 యూనిట్లు అమ్ముడయ్యాయి.
బెంగళూరు: 8 శాతం తగ్గి 15,120 యూనిట్లుగా (గత ఏడాది 16,355 యూనిట్లు) నమోదయ్యాయి.
పుణె: 27శాతం తగ్గి 21,145 యూనిట్ల నుంచి 15,410 యూనిట్లకు పడిపోయాయి.
హైదరాబాద్: కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు 27 శాతం తగ్గాయి. 15,085 యూనిట్ల నుంచి 11,040 యూనిట్లకు పడ్డాయి.
కోల్కతా: 23శాతం తగ్గి 3,525 యూనిట్లుగా (గత ఏడాది 4,560 యూనిట్లు) రికార్డయ్యాయి.
చెన్నై: ఒక్క చెన్నైలోనే ఇండ్ల సేల్స్ పెరిగాయి. ఏడాది లెక్కన 11 శాతం పెరిగి 5,660 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే టైమ్లో 5,100 యూనిట్లు సేల్ అయ్యాయి.
క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డామ్నిక్ రోమెల్ మాట్లాడుతూ, “జూన్ క్వార్టర్లో కీలక నగరాల్లో ప్రాపర్టీ సేల్స్లో స్వల్ప తగ్గుదల ఊహించినదే. ముంబైలో ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే 38,000 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి” అని అన్నారు. అఫోర్డబిలిటీ కంటే మార్కెట్ కన్సాలిడేషన్ వల్ల సేల్స్ తగ్గాయని, జియోపొలిటికల్ అనిశ్చితులు, గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోలు, ఎన్విరాన్మెంటల్, ఇతర రెగ్యులేటరీ అప్రూవల్స్ వల్ల ప్రాజెక్ట్ లాంచ్లు ఆలస్యమయ్యాయని ఆయన చెప్పారు. “కొత్త లాంచ్లు, పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల రాబోయే వారాల్లో మళ్లీ సేల్స్ ఊపందుకుంటాయి ” అని రోమెల్ అభిప్రాయపడ్డారు.