పెండ్లయిన 8 నెలలకే భార్యభర్త సూసైడ్

పెండ్లయిన 8 నెలలకే భార్యభర్త సూసైడ్

గుడిహత్నూర్‌, వెలుగు : జంటకు పెండ్లి జరిగి పట్టుమని ఏడాది కూడా కాలేదు. ఉన్నట్టుండి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త సైతం పురుగుల మందు తాగి సూసైడ్  చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్‌  మండలంలోని కొల్హారీలో జరిగింది. గ్రామానికి చెందిన సేవాళే విజయ్‌(24) కు మహారాష్ట్రకు చెందిన పల్లవి (20) తో నిరుడు మే నెలలో పెండ్లయింది. విజయ్‌ తండ్రి ఐదేండ్ల క్రితమే చనిపోగా ఐదుగురు అక్కాచెల్లెళ్లకు ఇదివరకే పెండ్లిళ్లు అయ్యాయి. విజయ్‌  తనకున్న 14 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ తల్లి పుష్పాబాయి, భార్యతో కలిసి ఉంటున్నాడు.

సంక్రాంతి కోసం పుట్టింటికి వెళ్లిన పల్లవి శుక్రవారం అత్తారింటికి వచ్చింది. ఏమైందో ఏమో సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె.. తన గదిలో పురుగుల మందు తాగింది. తర్వాతి రోజు తలుపులు తెరవకపోవడంతో స్థానికులు తలుపులు పగలకొట్టి చూశారు. బాధితురాలిని వెంటనే రిమ్స్ కు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్​ తీసుకుంటూ కొద్ది సమయానికే చనిపోయింది. దీంతో విజయ్.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయి జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. బంధువులు అతని కోసం ఎంత వెతికినా దొరకలేదు. తాను పురుగుల మందు తాగానని ఫోన్​లో బంధువులకు తెలుపగా.. వారు వెళ్లి శ్మశానవాటికలో పడి ఉన్న విజయ్‌ను రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.