భార్య ప్రసవానికి వెళ్లింది.. ఇల్లు అమ్ముకొని భర్త పరారయ్యాడు .. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన

భార్య ప్రసవానికి  వెళ్లింది.. ఇల్లు అమ్ముకొని భర్త పరారయ్యాడు .. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన

కూకట్​పల్లి, వెలుగు: భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి భర్త ఇల్లు అమ్ముకుని పరారయ్యాడు. ఈ ఘటన కూకట్​పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వరంగల్​జిల్లా చెన్నారావుపేటకు చెందిన శ్రావణ్​, జనగామ జిల్లా కోమల్లకు చెందిన నిఖితకు నాలుగేండ్ల కింద పెండ్లయింది. ఇద్దరూ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు కాగా, కూకట్​పల్లి పరిధి శాంతినగర్​లోని ఆర్ఆర్​ హోమ్స్​లో నివసిస్తున్నారు. పెండ్లి సమయంలో ఇచ్చిన కట్నం డబ్బుతో పాటు లోన్​తీసుకుని ఇదే అపార్ట్​మెంట్​లో ఒక ఫ్లాట్​ కొన్నారు. 

గతేడాది నిఖిత ప్రసవం కోసం తల్లిగారింటికి వెళ్లింది. ఆమెకు పాప పుట్టి 11 నెలలు వచ్చినా కుటుంబ కలహాలతో భర్త దగ్గరికి రాలేదు. శుక్రవారం తల్లిదండ్రులతో కలిసి కూకట్​పల్లిలోని తమ అపార్ట్​మెంట్​కు వెళ్లింది. తమ ఇంట్లో వేరే వారు ఉండటంతో షాక్​ అయింది.

 వారితో మాట్లాడగా శ్రావణ్​ వద్ద ఫ్లాట్​ కొన్నామని చెప్పారు. వెంటనే శ్రావణ్​కు ఫోన్​ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. కొన్ని రోజులుగా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ఇప్పుడు తనకు తెలియకుండానే ఇల్లు అమ్ముకుని పరారయ్యాడని నిఖిత ఆరోపించింది. కాసేపు ఆ ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. అనంతరం కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నారు.