
ఎడతెరిపిలేని వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. దీంతో రెండు జలాశయాల్లోనూ 6 గేట్ల చొప్పున ఓపెన్ చేసి, నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4,120 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ కు 1,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 1,380 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ (1,790 అడుగులు), ఉస్మాన్ సాగర్ (1,763.50 అడుగులు) రెండూ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మరిన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి (513.41 అడుగులు) చేరుకుంది. గ్రేటర్ లోని పలు చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. మియాపూర్ లోని పటేల్ చెరువు తెగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు.