
- హరే కృష్ణ.. హరే రామ..
బషీర్బాగ్/ ముషీరాబాద్/పద్మారావునగర్/ కూకట్పల్లి, వెలుగు: హరి నామస్మరణతో నగరం మార్మోగింది. భక్తుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ఆ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. బంజారాహిల్స్తోపాటు అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్స్ నుంచి వేర్వేరుగా రథయాత్ర కొనసాగింది.
బంజారాహిల్స్లోని పూరీ జగన్నాథఆలయం ఆధ్వర్యంలో బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడికి ప్రత్యేకంగా రథాలు అలంకరించి ఊరేగించారు. భారీగా భక్తులు రథాన్ని లాగి తన్మయత్వానికి లోనయ్యారు.
రోడ్డును ఊడ్చి.. ముగ్గులేసి.. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన రథయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్నగర్ బషీర్బాగ్ మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగింది.
రథయాత్ర నేపథ్యంలో ఆయా మార్గాల్లో వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులు ఈ సందర్భంగా రథం ముందు చీపుర్లతో ఊడ్చి, రథాన్ని లాగారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. యాత్ర ముందుకు సాగే దారిలో రోడ్డును శుభ్రం చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రథయాత్ర ముగింపులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కృష్ణతత్వాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
జయజయ ధ్వానాలతో స్వాగతం..కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ఆధ్వర్యంలో హైదర్నగర్లోని మైసమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి, బాలానగర్ మీదుగా సాగగా, భక్తులు జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు. సికింద్రాబాద్లో ఎమ్మెల్యే తలసాని యాత్రను ప్రారంభించారు. సంగీత్ చౌరస్తా వద్ద ప్రారంభమైన యాత్ర క్లాక్టవర్, ప్యాట్నీ, ఎస్పీ రోడ్డు, ఎస్డీ రోడ్డు నుంచి తిరిగి సంగీత్ చౌరస్తాకు చేరుకుంది.