
దేశంలోనే అతిపెద్ద జాతీయ పుస్తక ప్రదర్శనకు హైదరాబాద్ రెడీ అవుతోంది. ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు జరగనున్న పుస్తక ప్రదర్శన కోసం లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ ఏడాది బుక్ ఎగ్జిబిషన్ లో మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 10 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సాహిత్య వేడుకను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతియేటా డిసెంబర్ లో నిర్వహిస్తునామని బుక్ ఫెయిర్ నిర్వాహకులు చెబుతున్నారు.
పుస్తక ప్రియులకు అందుబాటులో
జాతీయ బుక్ ఫెయిర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇతర భాషల పుస్తకాలు లభించనున్నాయి. దీంతో పాటుగా బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ కూడా ఈ బుక్స్ స్టాల్స్ లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
పుస్తకాలను డోనేట్ చేయడం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ గ్రంథాలయాల కోసం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలను డోనేట్ చేయడం ప్రత్యేకత. విద్యావేత్త చుక్కా రామయ్య, విఠలాచార్య లాంటి ప్రముఖుల గ్రామాల్లో గ్రంథాలయాలకు బుక్స్ అందజేసిటనల్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ తెలిపారు. బుక్ ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు కొనసాగనుంది. శని, ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచనున్నారు. ఈ నెల 22 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం అవుతుండటంతో పలు రాష్ర్టాల నుంచి ఇప్పటికే సిటీకి వచ్చిన వారి కోసం.. బుక్ ఫెయిర్ నిర్వాహకులు ప్రత్యేక స్టాల్స్ ను కేటాయిస్తున్నారు.