నేపాలీలు పనిమనుషులుగా ఉన్న ఇళ్లకు నోటీసులు.. మాజీ IPS భార్య హత్య కేసుతో పోలీసులు కీలక నిర్ణయం...

నేపాలీలు పనిమనుషులుగా ఉన్న ఇళ్లకు నోటీసులు.. మాజీ IPS భార్య హత్య కేసుతో పోలీసులు కీలక నిర్ణయం...

హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ భార్య హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేపాలీలు పనిమనుషులుగా ఉన్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నేపాలీ పనిమనుషులను ఇంట్లో పెట్టుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

నేపాలీల వ్యక్తిగత వివరాలు, వారి ఫోటోలు, ఎవరి ద్వారా వచ్చి పనిలో చేరారు వంటి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ప్రముఖులు, ధనవంతుల ఇళ్లలో నేపాలీలు పని చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈమేరకు కీలక సూచనలు జారీ చేశారు. 

ఇదిలా ఉండగా.. మాజీ ఐపీఎస్ భార్య హత్య వెనుక ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలలుగా ప్లాన్ చేసిన స్కెచ్ అని పోలీసులు తేల్చారు.రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ ఇంట్లో జరిగిన క్రైమ్ దోపిడీ వెనుక నేపాల్‌కు చెందిన సాహు గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ కోసం ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసినట్లు తేల్చారు. పనిమనిషి ద్వారా కీలక ఆధారాలు సేకరించిన సాహు గ్యాంగ్..  ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను పనిమనిషి కల్పన ద్వారా రప్పించింది ముఠా. 

కొన్ని రోజుల పాట్ స్కెచ్ వేసిన గ్యాంగ్.. రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ భార్యను చంపేసి.. బంగారం, వెండి, డబ్బును ఎత్తుకెళ్లారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు  ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కీలక సూత్రదారి  కల్పన కోసం పుణెలో గాలిస్తున్నారు.