
సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సరోగసీముసుగులో బిడ్డను కొని తెచ్చి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్వో వెంకట్తో కలిసి ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాజస్తాన్కు చెందిన దంపతులు నాలుగేండ్లుగా సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. చాలా ఏండ్లుగా సంతానం కలగకపోవడంతో వీరు నిరుడు ఆగస్టులో సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించారు. అయితే.. మీరు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనడానికి వీలు పడదని, సరోగసీ ఉత్తమ మార్గమని ఆ దంపతులకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్ ఎ.నమ్రత చెప్పారు. దాంతో సరోగసీ(అద్దె గర్భం) కి ఒప్పుకున్న దంపతుల నుంచి రూ.30 లక్షలను క్లినిక్ నిర్వాహకులు వసూలు చేశారు. చివరకు వేరే మహిళకు పుట్టిన బిడ్డను కొని దంపతులకు అప్పజెప్పారు. డీఎన్ ఏ టెస్టుతో అసలు విషయం బయటపడింది.
పేద గర్భిణిని వైజాగ్ తరలించి..!
అసలు భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించి, వారికి రూ. 90 వేల వరకు ఇచ్చి, పుట్టబోయే బిడ్డ కొనుగోలుకు ప్లాన్ వేశారు. సరిగ్గా డెలివరీ సమయంలో ఆ పేదింటి గర్బిణి దంపతులను విమానంలో హైదరాబాద్ నుంచి వైజాగ్కు పంపించి.. అక్కడ డెలివరీ చేయించారు. డెలివరీ తర్వాత ఆ విషయం సరోగసికి ఒప్పుకున్న దంపతులకు చెప్పి.. మీ బాబే అంటూ అప్పగించారు.
2021లో ముగిసిన గడువు
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనుమతి గడువు 2021లోనే ముగిసిందని, అయినా వేరే సర్టిఫైడ్ డాక్టర్ సూరి శ్రీమతి పేరు మీద అక్రమంగా డాక్టర్ నమ్రత సృష్టి క్లినిక్ను నడిపిస్తున్నారని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వెంకట్ తెలిపారు. వాస్తవానికి ఇండియాలో కమర్షియల్ సరోగసికి అనుమతి లేదని, కేవలం మానవతా దృక్పథంతో దగ్గరి వారితో అద్దె గర్భం పద్ధతి ఉందని అన్నారు... ఈ కేసులో సరోగసీ లేదని, పేద దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి బాధిత దంపతులకు ఇచ్చారన్నారు. సృష్టి సెంటర్పై సోదాల్లో తాము కూడా పాల్గొన్నామన్నారు. 2021లో క్లినిక్ అనుమతులు క్లోజ్ అయ్యాయని, దాంతో తాము అప్పట్లోనే ఆ క్లినిక్ను మూసివేస్తూ క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామని తెలిపారు. కానీ, అక్రమంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను నడుపుతున్నారని అన్నారు. క్లినిక్ సెంటర్ లో థియేటర్ను గుర్తించామని, అనస్థీషియా ల్యాబ్, బెడ్స్, ఏడు రకాల అనాలసిస్ చేసే మెడికల్ ఎక్విప్ మెంట్ ఉందని పేర్కొన్నారు. డస్ట్ బిన్ చెక్ చేస్తే రెగ్యులర్గా ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఆసుపత్రి నడుపుతున్నారని పేర్కొన్నారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సరోగసీమోసం కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని, రెండు రాష్ట్రాల్లోని సృష్టి బ్రాంచుల్లో తమ పోలీసు బృందాలు, వైద్యాధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేయగా, వీరిని అంతకన్నా ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ (ఏపీ, తెలంగాణ) నిర్వహకురాలు డాక్టర్ అతలూరి నమ్రత (64), ఆమె కుమారుడు, క్లినిక్ మేనేజర్ జయంత్ కృష్ణ(25), సృష్టి వైజాగ్ బ్రాంచీ మేనేజర్ కళ్యాణి (40), ల్యాబ్ టెక్నిషియన్, ఎంబ్రలాజిస్ట్ చెన్నారావు(37), గాంధీ ఆస్పత్రి అనిస్థిషీయా అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్గుల సదానందం(41), అస్సాంకు చెందిన సిబ్బంది సంతోషి(38), మహ్మాద్ అలీ అదిక్(38), నస్రీన్ బేగం(25) ఉన్నారు. క్లినిక్లోని మెడికల్ ఎక్విప్ మెంట్, మెడిసిన్, మొబైల్ ఫోన్స్, డిజిటల్ డివైసెస్, కేసు రికార్డులు, సరోగసి, ఐవీఎప్ డాక్యుమెంట్లును స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.