90 వేలకు బిడ్డను కొని.. 35 లక్షలకు అమ్మిన IVF సెంటర్ : హైదరాబాద్ సరోగసీ కుంభకోణం

90 వేలకు బిడ్డను కొని.. 35 లక్షలకు అమ్మిన IVF సెంటర్ : హైదరాబాద్ సరోగసీ కుంభకోణం

సంచలనం సృష్టించిన సికింద్రాబాద్​ సృష్టి టెస్ట్​ ట్యూబ్ సెంటర్​ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సరోగసీముసుగులో బిడ్డను కొని తెచ్చి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. హైదరాబాద్​ జిల్లా డీఎంహెచ్​వో  వెంకట్​తో కలిసి ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాజస్తాన్​కు చెందిన దంపతులు నాలుగేండ్లుగా సికింద్రాబాద్​ మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. చాలా ఏండ్లుగా సంతానం కలగకపోవడంతో వీరు నిరుడు ఆగస్టులో సికింద్రాబాద్​లోని సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ను సంప్రదించారు. అయితే.. మీరు ఐవీఎఫ్​ ద్వారా పిల్లలు కనడానికి వీలు పడదని, సరోగసీ ఉత్తమ మార్గమని ఆ దంపతులకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంట​ర్​ డాక్టర్ ఎ.నమ్రత చెప్పారు. దాంతో సరోగసీ(అద్దె గర్భం) కి ఒప్పుకున్న దంపతుల నుంచి రూ.30 లక్షలను క్లినిక్​ నిర్వాహకులు వసూలు చేశారు. చివరకు వేరే మహిళకు పుట్టిన బిడ్డను కొని దంపతులకు అప్పజెప్పారు. డీఎన్ ఏ టెస్టుతో అసలు విషయం బయటపడింది. 

పేద గర్భిణిని వైజాగ్​ తరలించి..!

అసలు భర్త వీర్యంతో  సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లోని ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించి, వారికి రూ. 90 వేల వరకు ఇచ్చి, పుట్టబోయే బిడ్డ కొనుగోలుకు ప్లాన్​ వేశారు. సరిగ్గా డెలివరీ సమయంలో ఆ పేదింటి గర్బిణి దంపతులను విమానంలో హైదరాబాద్​ నుంచి వైజాగ్​కు పంపించి.. అక్కడ డెలివరీ చేయించారు. డెలివరీ తర్వాత ఆ విషయం సరోగసికి ఒప్పుకున్న దంపతులకు చెప్పి.. మీ బాబే అంటూ అప్పగించారు. 

2021లో ముగిసిన గడువు

సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ అనుమతి గడువు 2021లోనే ముగిసిందని, అయినా వేరే సర్టిఫైడ్​ డాక్టర్​ సూరి శ్రీమతి పేరు మీద అక్రమంగా డాక్టర్​ నమ్రత సృష్టి క్లినిక్​ను నడిపిస్తున్నారని హైదరాబాద్​ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వెంకట్ తెలిపారు. వాస్తవానికి ఇండియాలో కమర్షియల్​ సరోగసికి అనుమతి లేదని, కేవలం మానవతా దృక్పథంతో దగ్గరి వారితో అద్దె గర్భం పద్ధతి ఉందని అన్నారు... ఈ కేసులో సరోగసీ లేదని, పేద దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి బాధిత దంపతులకు ఇచ్చారన్నారు. సృష్టి సెంటర్​పై సోదాల్లో తాము కూడా పాల్గొన్నామన్నారు. 2021లో క్లినిక్​ అనుమతులు క్లోజ్​ అయ్యాయని, దాంతో తాము అప్పట్లోనే ఆ క్లినిక్​ను మూసివేస్తూ క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామని తెలిపారు. కానీ, అక్రమంగా టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ ను నడుపుతున్నారని అన్నారు. క్లినిక్​ సెంటర్​ లో థియేటర్​ను గుర్తించామని, అనస్థీషియా ల్యాబ్​, బెడ్స్​, ఏడు రకాల అనాలసిస్​ చేసే మెడికల్​ ఎక్విప్​ మెంట్​ ఉందని పేర్కొన్నారు. డస్ట్ బిన్​ చెక్​ చేస్తే రెగ్యులర్​గా ప్రాసెస్​ చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయన్నారు. తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ సర్టిఫికెట్​ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఆసుపత్రి నడుపుతున్నారని పేర్కొన్నారు. 

సృష్టి టెస్ట్ ట్యూబ్​ సెంటర్​ సరోగసీమోసం కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్​ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని, రెండు రాష్ట్రాల్లోని సృష్టి బ్రాంచుల్లో తమ పోలీసు బృందాలు, వైద్యాధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేయగా, వీరిని అంతకన్నా ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో సృష్టి టెస్ట్ ట్యూబ్​ సెంటర్ (ఏపీ, తెలంగాణ)​ నిర్వహకురాలు డాక్టర్​ అతలూరి నమ్రత (64), ఆమె కుమారుడు, క్లినిక్​ మేనేజర్​ జయంత్ కృష్ణ(25), సృష్టి వైజాగ్​ బ్రాంచీ మేనేజర్​ కళ్యాణి (40), ల్యాబ్​ టెక్నిషియన్​, ఎంబ్రలాజిస్ట్​ చెన్నారావు(37), గాంధీ ఆస్పత్రి అనిస్థిషీయా అసిస్టెంట్ ప్రొఫెసర్​ నర్గుల సదానందం(41),  అస్సాంకు చెందిన సిబ్బంది సంతోషి(38), మహ్మాద్​ అలీ అదిక్​(38), నస్రీన్​ బేగం(25)  ఉన్నారు. క్లినిక్​లోని మెడికల్​ ఎక్విప్​ మెంట్, మెడిసిన్​, మొబైల్​ ఫోన్స్, డిజిటల్​ డివైసెస్​, కేసు రికార్డులు, సరోగసి, ఐవీఎప్​ డాక్యుమెంట్లును స్వాధీనం చేసుకొని సీజ్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.