
హైదరాబాద్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హైడ్రా కమిషనర్ రంగనాత్ చెప్పారు. సెప్టెంబర్ 26న బతుకమ్మ కుంటను ప్రారంభిస్తారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే చెరువును పునరుద్ధరిస్తున్నామని చెప్పిన ఆయన.. ఎక్కడా కోర్టులను దిక్కరించడం లేదని చెప్పారు.
చెరువుల పునరుద్ధరణలో భాగంగా బతుకమ్మ కుంటను రూ.7.40 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేసింది. 5 ఎకరాల 12 గుంటల్లో ఉన్న బతుకమ్మ కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. 1962–63 లెక్కల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల 6 గుంటల్లో బతుకమ్మ కుంట ఉండగా, అప్పట్లో బఫర్ జోన్ తో కలిపి 16 ఎకరాల13 గుంటలు ఉండేది. క్రమంగా ఆక్రమణలకు గురికాగా, తాజాగా హైడ్రా నిర్వహించిన సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలు ఉన్నట్లు గుర్తించి ఈ స్థలంలో చెరువుని అభివృద్ధి చేసింది.
ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఉత్పవాలు ఇక్కడే నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా హైడ్రా పనులు చేసింది. ఒకప్పటి బతుకమ్మ కుంటతో ప్రస్తుతం పోలిస్తే పూర్తిగా రూపురేఖలు మారాయి.