హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ పార్కులో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ పార్కులో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం

హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ప్రభుత్వ స్థలాలు, చెరువులపై ఆక్రమణలను ఎక్కడికక్కడ కూల్చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది హైడ్రా. ఈ క్రమంలో ఆదివారం ( జూన్ 29 ) హైదరాబాద్ లోని మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడ పార్కులో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. ఆక్రమణలు తొలగించి 1533 గజాల విస్తీర్ణంలో పార్కును అందుబాటులోకి తెచ్చింది హైడ్రా. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

స్థానిక సాయి సారధి నగర్ లేఔట్ లో 1961 నుంచి ఆక్రమణలు ఉన్నాయని.. సాయి సారధీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టింది హైడ్రా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు ఆక్రమణలు తొలగించారు. 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధి నగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేశారని.. 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించారని నిర్దారించారు అధికారులు.

నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్డు వేసి.. ఖాళీ చేయకుండా ఆక్రమణలో ఉన్న స్థలంలో లేఔట్ వేసినట్లు ఫిర్యాదు చేశారు స్థానికులు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇంటి నంబర్ కూడా తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ లేఔట్లో 6  రోడ్లను అభివృద్ధి చేసి పార్కును మాత్రం ఖాళీ చేయించలేదని.. పలుమార్లు జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలతో కలసి పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు.. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించారు. 

అనంతరం పార్కు స్థలంగా గుర్తించి ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డు పెట్టారు అధికారులు.దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.