ఆక్రమణలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేసిన లేఔట్లను తొలగించి కోట్ల విలువైన స్థలాన్ని కాపాడింది. ఫిబ్రవరి 4న బడంగ్పేట్ సర్కిల్ లో కబ్జాకు గురైన పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది, ప్రశాంతి డివిజన్లో నందిల్స్ రోడ్ నెంబర్–8 లో 24,25,26 సర్వే నెంబర్లలో మొత్తం 2100 గజాల ప్రభుత్వ పార్కు స్థలంలో సుమారు 600 గజాల స్థలం కబ్జాకు గురైందని హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది.
హైడ్రా అధికారులు వెంటనే హైడ్రా సీఐ తిరుమలేష్ నేతృత్వంలో అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.పరిశీలనలో భాగంగా, పార్కు స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నం చేసినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేసి కాపాడినట్టు వెల్లడించారు. ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కు స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా చేయనివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు.
