న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రెసిడెంట్ అయితే క్రికెట్తో పాటు క్రికెటర్లకు మేలు జరుగుతుందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. ఐసీసీ టాప్ పోస్ట్కు గంగూలీ అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మద్దతు తెలుపకపోయినా, మిగిలిన బోర్డులన్నీ దాదావైపే ఉంటాయని కనేరియా చెప్పాడు. ప్రస్తుత ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు జులైలో ఐసీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఐసీసీ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ బీసీసీఐ బాస్ గంగూలీకి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. ‘సౌరవ్ గంగూలీ ఐసీసీ ప్రెసిడెంట్ అయితే క్రికెట్తోపాటు ప్లేయర్లకు కూడా మేలు జరుగుతుంది. ఓ గొప్ప క్రికెటర్ అయిన సౌరవ్ ఐసీసీ టాప్ పోస్ట్కు అన్ని విధాలా అర్హుడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. ఇండియాకు కెప్టెన్సీ చేశాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ను నడిపించాడు.
అయితే బోర్డులన్నీ గంగూలీకి మద్దతివ్వడంపైనే అంతా ఆధారపడి ఉంది. మిగిలిన బోర్డులన్నీ సపోర్టు చేసి పీసీబీ మద్దతు ఇవ్వకపోయినా సరే దాదాకు కావాల్సినన్ని ఓట్లు ఉంటాయి. పైగా, గంగూలీని కాదనడానికి బోర్డులకు పెద్దగా కారణాలు కూడా లేవు. టీమిండియాను నడిపించడం ద్వారా గంగూలీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అందువల్ల ప్రతీ విషయంపై అతనికి అవగాహన ఉంది. ఏ అంశాన్ని ఎలా డీల్ చేయాలో, ప్లేయర్లకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో, అసోసియేట్ కంట్రీస్ ఏం కోరుకుంటాయో గంగూలీకి తెలుసు’ అని కనేరియా చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా ఐసీసీ ప్రెసిడెంట్ పోస్ట్కు గంగూలీ తగినవాడని చాలా రోజుల క్రితమే చెప్పాడు. కాగా, బీసీసీఐ ప్రెసిడెంట్గా గంగూలీ పదవీకాలం జులై నెలాఖరుతో ముగుస్తుంది. లోధా కమిటీ సూచించిన కూలింగ్ ఆఫ్ పిరియడ్కు అదనంగా పదవీ కాలాన్ని పెంచాలని బీసీసీఐ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇందుకు కోర్టు అంగీకరిస్తే బీసీసీఐ బాస్గా దాదా మరికొంత కాలం కొనసాగుతాడు.