V6 News

అసలైన క్రికెట్​ మజా ఇస్తున్న ‘ఐబీ క్రికెట్​’

అసలైన క్రికెట్​ మజా ఇస్తున్న ‘ఐబీ క్రికెట్​’

కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ రికార్డులను తిరగరాస్తుంటే ఎగిరి గంతేస్తాం. రోహిత్  శర్మ ఇంకో డబుల్​ సెంచరీ కొట్టేస్తుంటే ఈలలతో గోలగోల చేస్తాం. మరి, మనమూ కోహ్లీలా, రోహిత్​ శర్మలా క్రికెట్​ ఆడేస్తే పోలా? అదేదో మామూలు గ్రౌండ్​లో నలుగురు ఫ్రెండ్స్​తోనో లేదంటే మొబైల్​ ఫోన్​లో గేమో ఆడినట్టు కాదు. చుట్టూ క్రికెట్​ అభిమానుల గోలల మధ్య గ్రౌండ్​లో సిక్సర్లు కొట్టేస్తే మజా ఎట్లుంటది? అది అయ్యే పని కాదంటారా.. కానీ, వర్చువల్​ రియాలిటీ (వీఆర్​)తో ఏదైనా సాధ్యమే అంటోంది ‘ఐబీ క్రికెట్​’! అవును, మనం నిజంగా క్రికెట్​ ఆడిన ఫీలింగ్​ కలిగేలా హైదరాబాద్​కు చెందిన ‘ప్రోయుగ’ అనే స్టార్టప్​ వీఆర్​ ఫార్మాట్​లో ‘ఐబీ క్రికెట్​’ను తీసుకొచ్చింది. గ్రౌండ్​లో ఆడితే ఎట్లాంటి జోష్​ ఉంటుందో అట్లాంటి జోష్​ను క్రికెట్​ఫ్యాన్స్​ కోసం తెచ్చింది. ఆడ, మగ, వయసు తేడా లేకుండా ఎవరైనా మస్త్​ జోష్​తో గేమ్​ను ఎంజాయ్​ చేయొచ్చని చెబుతోంది.

మన చుట్టూ ఉండే పరిసరాలే ప్లేగ్రౌండ్

మన చుట్టూ ఉండే పరిసరాలనే ప్లేగ్రౌండ్​గా మార్చేస్తుంది ఐబీ క్రికెట్​. ఏదో ఒంటరిగా గేమ్​ ఆడుతున్నామన్నట్టు కాకుండా, నిజమైన క్రికెట్​లో ఎలాగైతే ఉంటుందో అలాంటి కిక్​నే అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రపంచంలోని అత్యాధునికమైన స్టేడియాలలో ఆడేలా గేమ్​ను తీర్చిదిద్దింది. సిక్స్​ కొట్టినా, ఫోర్​ బాదినా ప్లేయర్​ను చీర్​ చేసేలా లైవ్​ కామెంటరీ కూడా ఉంటుంది. పిచ్​, బౌలర్లు, స్కోర్​బోర్డు వంటి ఫీచర్లతో రియల్​ గేమ్​ ఆడుతున్న అనుభూతిని ఇస్తుంది. పర్సనలైజ్డ్​ ఏఐ కోచ్​తో గేమ్​లో లెవెల్సూ ఉంటాయి. ఐబీ హబ్స్​ సాయంతో ఎక్స్​ఆర్​ టెక్నాలజీపై ఫోకస్డ్​గా ప్రోయుగ కంపెనీని పెట్టారు ట్రిపుల్​ఐటీ హైదరాబాద్​ గ్రాడ్యుయేట్​ వసంత్​. కంపెనీలో ఐఐటీ, ఐఐఎంలకు చెందిన గ్రాడ్యుయేట్లూ ఉన్నారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన త్రివిక్రమ్​, కంపెనీ కోఫౌండర్​, సీఈవోగా ఉన్నారు. ఓ ఎంఎన్​సీ ఇచ్చిన కోటి రూపాయల ఆఫర్​ను కాదనుకుని ఆయన ఈ కంపెనీలో భాగస్వాములయ్యారు.

ఎక్కడెక్కడున్నాయ్​

ప్రస్తుతం ఇండియా సహా ఐదు దేశాల్లో ఐబీ క్రికెట్​ తన ఆర్కేడ్​లను స్టార్ట్​ చేసింది. సింగపూర్​, బ్రిటన్​, ఆస్ట్రేలియా, దుబాయ్​ వంటి దేశాల్లో అవి ఉన్నాయి. ఇండియాలో 30 ఆర్కేడ్​లున్నాయి. హైదరాబాద్​లో గచ్చిబౌలి, దిల్​సుఖ్​నగర్​, కూకట్​పల్లి, మదీనాగూడ, కొండాపూర్​, సుచిత్ర, శేరిలింగంపల్లిల్లో 8 ఆర్కేడ్​లున్నాయి. 35కు పైగా దేశాలకు చెందిన ప్రజలు 10 లక్షలకు పైగా బాల్స్​ను ఆడారు. యువరాజ్​సింగ్​, జహీర్​ఖాన్​, షేన్​ వాట్సన్​, డ్వేన్​ బ్రేవో, ఆండ్రీ రస్సెల్​, కీరన్​ పొలార్డ్​, లసిత్​ మలింగ, క్రిస్​ లిన్​, ఇయాన్​ మోర్గాన్​ వంటి స్టార్​ క్రికెటర్లతో ఆడే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే, అది కేవలం ‘వర్చువల్​ రియాలిటీ’లోనే అనుకోండి. ఐబీ క్రికెట్​ను ఎంజాయ్​ చేయాలంటే https://ib.cricket/vsport-arcades/ లో స్లాట్​ బుక్​ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది.

స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

‘ఆంత్రప్రెన్యూర్​ ఇండియా 2019’ అవార్డుల్లో కంపెనీ స్టార్టప్​ ఆఫ్​ ద ఇయర్​ అవార్డును అందుకుంది. పోయినేడాది జరిగిన ఐసీసీ క్రికెట్​ వరల్డ్​కప్​లో భాగంగా ఇండియా, బ్రిటన్​, దక్షిణాఫ్రికా, దుబాయ్​, శ్రీలంకల్లో అభిమానుల కోసం ఈవెంట్లను నిర్వహించింది. చెన్నైసూపర్​కింగ్​, ఢిల్లీ క్యాపిటల్స్​, రాజస్థాన్​ రాయల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​, రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు వంటి ఐపీఎల్​ టీంలకు అఫీషియల్​ వీఆర్​గేమింగ్​ పార్ట్​నర్​గా ఉంది. అంతేగాకుండా వ్యూతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్​ రియాలిటీ క్రికెట్​ టోర్నమెంట్​‘ఐబీ క్రికెట్​ సూపర్​ ఓవర్​ లీగ్​’ను ఐబీ క్రికెట్​ నిర్వహించింది. వీరేందర్​ సెహ్వాగ్​, సురేశ్​ రైనా, హెర్షెలే గిబ్స్​, మెక్​కలమ్​ వంటి స్టార్లు అందులో పాల్గొన్నారు. గత ఏడాది ముగిసిన అబుధాబి టీ10 లీగ్​కూ వీఆర్​ క్రికెట్​పార్ట్​నర్​గానూ పనిచేసింది. ప్రస్తుతం మహేశ్​ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకూ వీఆర్​ పార్ట్​నర్​గా ఉంది.