2024 టీ20 వరల్డ్ కప్ కోసం కొత్త ఫార్మాట్

2024 టీ20 వరల్డ్ కప్ కోసం కొత్త ఫార్మాట్

టీ20 వరల్డ్ కప్ 2024 సరికొత్త ఫార్మాట్లో జరగనుంది. రానున్న టీ20 వరల్డ్ కప్లో 20 జట్లు పాల్గొంటాయని ఐసీసీ వెల్లడించింది. కొత్త ఫార్మాట్ వివరాలను వెల్లడించిన ఐసీసీ..2024 టీ20 ప్రపంచకప్లో సూపర్ 12 దశ ఉండబోదని ప్రకటించింది. సూపర్ 8 దశను ప్రవేశపెట్టింది. సూపర్ 8లోనూ రెండు గ్రూపులు ఉంటాయని పేర్కొంది. 

నాలుగు గ్రూపులు..ఐదు జట్లు..
2024 లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ కసరత్తు మొదలు పెట్టింది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో 20 జట్లు ఆడతాయని ఐసీసీ వెల్లడించింది. 20 జట్లను 4 గ్రూపులుగా విడగొట్టి టోర్నీని నిర్వహించనుంది. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉండనున్నాయి. ప్రతి గ్రూప్‌ లో టాప్  2లో నిలిచిన రెండు జట్లు సూపర్‌ 8కు చేరుకోనున్నాయి. 

సూపర్ 8లోనూ గ్రూపులు..
సూపర్‌ 8 దశలో నాలుగేసి జట్లను రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతాయి. ఈ రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు క్వాలిఫై అవుతాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. 

12 జట్లు నేరుగా అర్హత..
2024 టీ20 వరల్డ్ కప్ కోసం 12 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశాలుగా వెస్టిండీస్, అమెరికా జట్లకు స్థానం దక్కింది. టీ20 వరల్డ్‌కప్ 2022లో సూపర్‌-12 నుంచి టాప్ 8 జట్లు 2024 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా ఆడనున్నాయి.  వీటితో పాటు..ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు అర్హత పొందాయి.  మరో 8 స్థానాల కోసం..  క్వాలిఫికేషన్‌ మ్యాచులు జరగనున్నాయి.