- లార్డ్స్ కాదు.. సౌతాంప్టన్లో
- మారిన డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక
- బీసీసీఐ బాస్ గంగూలీ క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ (డబ్ల్యూటీసీ) వేదిక మారింది. గతంలో షెడ్యూల్ చేసిన ఇంగ్లండ్ లార్డ్స్ స్టేడియంలో కాకుండా సౌతాంప్టన్ (ఏజెస్ బౌల్)లో మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సోమవారం కన్ఫామ్ చేశాడు. జూన్ 18 నుంచి 22 మధ్య జరిగే ఈ మ్యాచ్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. లార్డ్స్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వేదికను షిఫ్ట్ చేసినట్లు చెప్పాడు. ‘ఫైనల్ ఏజెస్ బౌల్ స్టేడియంలో జరుగుతుంది. సౌతాంప్టన్లో స్టేడియం లోపలే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. ప్లేయర్లకు, మ్యాచ్ అఫీషియల్స్కు ఈజీగా బయో బబుల్ను క్రియేట్ చేయొచ్చు. ఐసీసీ, ఈసీబీకి ఈజీగా ఉంటుంది’ అని దాదా పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు తాను యూకే వెళ్లే అవకాశాలున్నాయన్నాడు. ఇంగ్లండ్తో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడే కివీస్.. ఫైనల్స్ కోసం అక్కడే ఉంటుందన్నాడు. అయితే ఫైనల్లో మాత్రం ఇండియానే గెలుస్తుందని సౌరవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
సిరీస్ విజయం అతి పెద్ద ఘనత..
ఇంగ్లండ్పై సిరీస్ గెలవడం టీమిండియా సాధించిన అతిపెద్ద ఘనత అని దాదా కొనియాడాడు. ‘బబుల్లో ఉన్న ప్లేయర్లు ఇంత అద్భుతమైన పెర్ఫామెన్స్ చేస్తారని ఊహించలేదు. ప్రతి రోజు ఓ కొత్త రకమైన క్రికెట్ను చూపెట్టారు. ఇది మర్చిపోలేని అనుభూతి. ఐపీఎల్ నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ప్లేయర్ల అచీవ్మెంట్ ఫెంటాస్టిక్. హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్, ప్రతి ఒక్కర్ని అభినందించాల్సిందే. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో ద్రవిడ్ పాత్ర మరవలేనిది. తెర వెనుక అతను చేసిన కృషిని ఎంత పొగిడినా తక్కువే. బ్రిస్బేన్లో మ్యాచ్ ఔట్స్టాండింగ్’ అని గంగూలీ పేర్కొన్నాడు.
పంత్ మ్యాచ్ విన్నర్
యంగ్ గన్ రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్ అని సౌరవ్ అన్నాడు. ‘గత రెండేళ్ల నుంచి పంత్ను చూస్తున్నా. అతనో మ్యాచ్ విన్నర్. తన రోజు వచ్చిందంటే కచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాడు. ధోనీ, సెహ్వాగ్, యువీలా తయారయ్యాడు. మొతెరాలో ప్రెజర్ సిచ్యువేషన్లో అతను చేసిన సెంచరీ సూపర్బ్. కౌంటర్ అటాకింగ్ గేమ్ బాగుంది. బలమైన రిజర్వ్ బెంచ్ను తయారు చేసిన మాస్టర్ మైండ్ ద్రవిడే. బుమ్రా లేకపోయినా సిరాజ్, శార్దూల్ ఆసీస్లో ఫైనల్ టెస్ట్ గెలిపించారు. దీనికీ కారణం ద్రవిడే’ అని ఈ మాజీ కెప్టెన్ వెల్లడించాడు. ఏజ్ పెరుగుతున్న టైమ్లో చిన్నచిన్న సమస్యలు వస్తాయని, వాటిని చూసి భయపడాల్సిన పని లేదన్నాడు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని దాదా చెప్పుకొచ్చాడు.
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన దాదా
తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి అవకాశాలు వస్తాయో, అవి ఎక్కడిదాకా వెళ్తాయో చూడాలని నర్మగర్భంగా మాట్లాడాడు. దాదాను తమతో కలుపుకునేందుకు అటు టీఎంసీ, ఇటు బీజేపీ పోటీపడుతున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో వాటిని ఖండించిన దాదా.. ఇప్పుడు మాత్రం మరోలా స్పందించాడు. ‘మనకు ఎలాంటి అవకాశాలు వస్తాయి. అవి ఎంతవరకు వెళ్తాయి. వాటి నుంచి మనం ఏం తీసుకుంటామో నిర్ణయించుకోవాలి. నా లైఫ్లో చాలా ట్విస్ట్లు, టర్న్లు ఉన్నాయి. తర్వాత ఏంటనే దాని గురించి నా వద్ద ఎప్పుడూ క్లూ ఉండదు. నేను ఇండియాకు కెప్టెన్ అయినప్పుడు సచిన్ ఆ పోస్ట్లో ఉన్నాడు. కాబట్టి దానిని నేను ఊహించలేదు. అతను రిజైన్ చేయకపోతే నాకు ఆ పోస్ట్ దక్కేది కాదు. అలాగే, నేను బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతానని కొన్ని నిమిషాల ముందు వరకు కూడా అనుకోలేదు. కానీ అయ్యా. అందుకే నా లైఫ్లో ఏదీ ప్లాన్ ప్రకారం జరగదు. అందుకే పాలిటిక్స్ కూడా ఎంతవరకు వెళ్తాయో చూద్దాం’ అని దాదా పేర్కొన్నాడు. రకరకాల కోణాల్లో, భిన్నమైన పరిస్థితులకు అనుగుణంగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

