నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు: సానియా

నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు: సానియా
  • రీ ఎంట్రీలో సాధించేదంతా బోనస్‌‌   
  • వచ్చే జనవరిలో బరిలోకి

న్యూఢిల్లీ:  తన కెరీర్‌‌లో ఇప్పటికే చాలా సాధించానని, పునరాగమనంలో  నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని ఇండియా ఏస్‌‌ టెన్నిస్ ప్లేయర్‌‌ సానియా మీర్జా తెలిపింది. బాబుకు జన్మనిచ్చాక రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న సానియా.. పునరాగమనంలో సాధించేదంతా బోనస్‌‌ అని వ్యాఖ్యానించింది. వచ్చే జనవరిలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఈ హైదరాబాదీ ప్లేయర్‌‌.. ప్రెగ్నెన్సీ కారణంగా పెరిగిన  26 కిలోల బరువు తగ్గించుకుంది. అలాగే రోజుకు నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తోంది.

‘కలగన్నవన్నీ నా కెరీర్‌‌లో సాధించా. రీ ఎంట్రీ తర్వాత దక్కబోయేది బోనస్‌‌గా భావిస్తున్నా. నిజానికి ఈ నెలలోనే కోర్టులోకి అడుగుపెట్టాలని అనుకున్నా కానీ కుదర్లేదు. జనవరిలోపు బరిలోకి దిగుతానన్న నమ్మకం ఉంది. ఇజాన్‌‌ మాలిక్‌‌ మీర్జా (కొడుకు)కు జన్మనివ్వడం  దేవుడిచ్చిన గొప్ప వరం. నేను ఫిట్‌‌గా మారడంలో తను ఇన్స్‌‌పిరేషన్‌‌గా నిలిచాడు. పునరాగమనంలో సత్తాచాటితే బాగుంటుంది. అయితే, నన్ను నేను నిరూపించుకునేందుకు బరిలోకి దిగడం లేదు. ఆటపై  ప్రేమకొద్దే మళ్లీ టెన్నిస్‌‌ కోర్టులోకి రావాలనుకుంటున్నా. సత్తాచాటితే మాత్రం వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌‌ గురించి తప్పకుండా ఆలోచిస్తా.  బిడ్మకు జన్మనిచ్చాక టెన్నిస్‌‌లో సత్తాచాటుతున్న అమెరికా లెజెండరీ ప్లేయర్‌‌ సెరెనా విలియమ్స్‌‌ నాకు స్పూర్తి’ అని సానియా చెప్పుకొచ్చింది.