
మిర్యాలగూడ, వెలుగు: లక్కీ డ్రా పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కొందరు వ్యక్తులు చివరకు బోర్డు తిప్పేశారు. ఇటు గిఫ్ట్లు ఇవ్వకుండా.. అటు డబ్బులు చెల్లించకుండా తప్పించుకుపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... మిర్యాలగూడకు చెందిన కొమ్ము కోటేశ్వరరావు, కొమ్ము నరేశ్, బచ్చలకూరి శ్రీనివాస్ అనే వ్యక్తులు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆర్కే ఎంటర్ ప్రైజెస్ పేరుతో 2023 అక్టోబర్లో ఆఫీస్ను ప్రారంభించారు. 15 నెలల కాలపరిమితికి ప్రతి నెలా రూ. 1000 కడితే నెల నెలా లక్కీ డ్రాలో కార్లు, బైక్లు, బంగారం, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, సోఫా, బెడ్స్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చని ప్రచారం చేశారు.
ప్రతి నెల 25న డ్రా తీసి విజేతలకు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని మరీ సభ్యులను చేర్పించుకున్నారు. ఇలా వెయ్యి మంది సభ్యులు ప్రతి నెల రూ. వెయ్యి చొప్పున 15 నెలల పాటు మొత్తం రూ. 1.50 కోట్లు కట్టారు. మొదట కొంత మందికి బహుమతులు ఇచ్చిన నిర్వాహకులు తర్వాత కనిపించకుండా పోయారు.
స్కీమ్ కాలపరిమితి జనవరిలోనే ముగిసినా, లక్కీ డ్రా పూర్తై ఆరు నెలలు గడుస్తున్నా బహుమతులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్వాహకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 3.90 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.