- బలహీన వర్గాలను పట్టించుకోవట్లేదు: మంద కృష్ణ
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల విషయంలో మానవత్వంతో చర్చించాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. కుల, మతాలతో సంబంధం లేకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్లో దిశ.. ఈ రెండు ఘటనలు మాత్రమే బయటకు వచ్చాయని అన్నారాయన. దిశ ఘటనలో కులం ఎక్కువగా ప్రచారం అయిందన్నారు మంద కృష్ణ. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారని, పార్లమెంటులోనూ గట్టిగా మాట్లాడారని ఆయన చెప్పారు.
దేశంలో రోజూ ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, పట్టించుకునేవాళ్లు లేరని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రేప్ ఘటనల్లోనూ అగ్రకులాలకు తప్ప, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగడం లేదన్నారు. దిశ కంటే మూడు రోజుల ముందు లింగాపూర్లో గిరిజన మహిళ సమతపై ఘోరంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన జరిగిందని తెలిపారు మంద కృష్ణ. కానీ అక్కడ న్యాయం జరుగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టినా.. పట్టించుకోకుండా ఎన్కౌంటర్తో ప్రతీకారం తీర్చుకున్నారని అన్నారాయన.