
- కొంతకాలం కిందటేహెచ్ఎండీఏ కసరత్తు
- గత ప్రభుత్వంలో ప్రపోజల్స్ పెండింగ్
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు రాబోయే రోజుల్లో మినీ నగరాలుగా రూపుదిద్దుకోనున్నాయి. రోజురోజుకు సిటీపై ఒత్తిడి పెరుగుతుండగా హెచ్ఎండీఏ ప్రత్యామ్నాయంగా మినీ సిటీస్ నిర్మాణాలపై కసరత్తు షురూ చేసింది. ప్రధానంగా సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లమ్, మరోవైపు పొల్యూషన్ నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు సిటీలో ఉండడంతో జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వలసలు వస్తున్నారు. దీంతో సిటీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇక సిటీ శివారు ప్రాంతాల్లోనే అందమైన నగరాలను నిర్మించేందుకు హెచ్ఎండీఏ ఆలోచన చేసింది.
గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. కానీ అటునుంచి ఎలాంటి స్పందన రాకపోగా, ఆ ప్రపోజల్స్ పెండింగ్ పడ్డాయి. ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మినీ నగరాల ద్వారా ట్రాఫిక్, పబ్లిక్ట్రాన్స్పోర్ట్వ్యవస్థలు బాగుపడతాయని భావిస్తున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లోని11 ప్రాంతాల్లో మినీ సిటీస్ ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పైలట్ ప్రాజెక్టులుగా ఇబ్రహీంపట్నం, తుర్కపల్లి!
సిటీకి సమీపంలోని తుర్కపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను మినీ నగరాలుగా నిర్మిస్తే బాగుంటుందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించినట్టు తెలిసింది. ఈ రెండు ప్రాంతాల్లో పైలట్ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటుంది. గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ సిద్ధం చేసినా అమలు కాలేదు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వమైనా సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు అధికారులు తుర్కపల్లి, ఇబ్రహీంపట్నంలో రెండు లేదా మూడు కి.మీ. విస్తీర్ణంలో మినీ నగరాలను నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందులో బ్యాంకులు, మార్కెట్లు, హోటళ్లు, షాపింగ్మాల్స్వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదించారు. పూర్తి స్థాయిలో సిటీ అభివృద్ధి చేస్తే జిల్లాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్ రావడం తగ్గుతుందనుకుంటున్నారు.
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం
మినీ నగరాల్లో భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే కనీస సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో రైతుల నుంచి భూసేకరణ పనులను హెచ్ఎండీఏ చేయాలని, మౌలిక సదుపాయాల కల్పన వంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టును చేపట్టడానికి త్వరలోనే ఔత్సాహికుల నుంచి టెండర్లను ఆహ్వానించాలని కూడా హెచ్ఎండీఏ చూస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరాల్లో భూములు లభిస్తున్నాయి. దీనికితోడు సిటీ చుట్టూ దాదాపు 50–-60 కిలోమీటర్ల మేర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. దీంతో ఎల్లలు లేకుండా దూసుకుపోతున్న విస్తరణతో సిటీ భూములకు డిమాండ్ వచ్చింది.
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భూమి కొనుగోలుకు పోటీపడుతున్నాయి. దీంతో భవిష్యత్ లో ఇక్కడ భూముల లభ్యత కష్టసాధ్యంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మినీ నగరాల నిర్మాణానికి ఇదే మంచి సమయం అని పేర్కొంటున్నారు.