ఎల్బీనగర్, వెలుగు : గుర్తు తెలియని ముగ్గురు దుండగులు మాస్క్లతో జువెలరీ షాప్లోకి చొరబడి యజమాని కుమారుడిని కత్తితో గాయపరిచి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన చాదర్ ఘట్ పీఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం మలక్ పేట్ అక్బర్ బాగ్ లో ఉండే మహమూద్ కిస్వా జువెల రీ షాపు నిర్వహిస్తున్నాడు.
బుధవారం మధ్యాహ్నం మహమూద్ తన కుమారుడు మహ్మద్ సజా ఉర్ రెహమాన్ ను షాపులో ఉంచి పనిమీద బయటకు వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జువెలరీ చూపించాలని కోరాడు. అనంతరం మరో ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో షాపులో చొరబడి మహ్మద్ సజా ఉర్ రెహమాన్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి బంగారు, వెండి ఆభరణాలను బ్యాగ్లో వేసుకుని పారిపోయారు.
మహమూద్ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకీ, క్లూస్ టీం వెళ్లి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంలో దాదాపు రూ.15 నుంచి 20 లక్షల ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు యజమాని తెలిపాడు. ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.