ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది మొత్తం హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయని INCOIS హెచ్చరించింది. దీని ప్రభావంతో తూర్పు తీరంలో పగడపు దిబ్బలు తెల్లబడటం, చేపల వేట తగ్గడం, తీరకోత పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.ఎల్ నినో ప్రభావం సముద్ర పర్యావరణానికే కాకుండా మత్స్యకారుల జీవనోపాధి, చేపల ధరలు, తీర ప్రాంత ప్రజల భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎల్ నినో ప్రభావంపై హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఎల్ నినో ప్రభావం శీతాకాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఎల్ నినో ప్రభావంతో 2027 ఏప్రిల్-మే వరకు హిందూ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. ముఖ్యంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని సముద్ర జీవవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.
2027 మార్చి నుంచి మే మధ్య కాలంలో సముద్రంలో ఉష్ణ ఒత్తిడి పెరగడంతో పగడపు దిబ్బలు తెల్లబడటం, సముద్ర ఉష్ణ తరంగాలు ఎక్కువగా సంభవించడం జరగవచ్చు. అదే విధంగా చేపలు అనుకూల ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా వాటి సంతానోత్పత్తి తగ్గడం వల్ల చేపల వేటపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సార్డిన్, మాకెరెల్ వంటి జాతుల లభ్యత తగ్గవచ్చని తెలిపింది. చేపల పెరుగుదల కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రుతుపవనాల సమయంలో బంగాళాఖాతం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. దీంతో భారత తూర్పు తీర ప్రాంతాల్లో తీరకోత, వరదల ప్రమాదం పెరిగే అవకాశముంది. అయితే పశ్చిమ తీరానికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అరేబియా సముద్రం సాధారణం కంటే ప్రశాంతంగా ఉంటుందని సముద్ర కార్యకలాపాలు సులభంగా సాగవచ్చని తెలిపింది. పశ్చిమ తీరంలో తీరకోత, ముంపు ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని INCOIS పేర్కొంది.
మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు, సముద్ర రంగాలకు చెందిన వారు అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తదుపరి ప్రత్యేక బులెటిన్ జూలై రెండో వారంలో విడుదల కానుంది.
