- హార్మూజ్ మూసివేతతో నిర్ణయం
- 30 రోజుల కోసం లైసెన్స్ ఇచ్చిన యూఎస్ ట్రెజరీ శాఖ
- తర్వాత అమెరికా నుంచి మళ్లీ కొనుగోలు చేయాలని షరతు
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ కు మళ్లీ చమురు దిగుమతులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికే ఇండియన్ రిఫైనరీలు కొన్ని మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ను కొనుగోలు చేశాయి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాల మధ్య చమురు రవాణాకు ఇబ్బందులు ఉండకూడదని అమెరికా భావించింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి క్రూడాయిల్ కొనేందుకు భారత్ కు యూఎస్ అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనవచ్చని,ఆ తర్వాత తమ దేశం నుంచి చమురు కొనాలని షరతు పెట్టింది.
ఈ మేరకు యూఎస్ ట్రెజరీ డిపార్ట్ మెంట్ మంత్రి స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’ లో ప్రకటన చేశారు. ‘‘అమెరికాకు భారత్ కీలక భాగస్వామి. హార్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో 30 రోజుల వరకు మాత్రమే రష్యా నుంచి చమురు కొనేందుకు ఇండియన్ రిఫైనరీలకు పర్మిషన్ ఇస్తున్నాం. తర్వాత మా వద్ద ఇండియా చమురు కొంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోలుకు ఇండియా అనుమతి ఇవ్వడంతో ఆ దేశంపై ఒత్తిడి తగ్గుతుంది” అని స్కాట్ పేర్కొన్నారు.
కాగా.. అమెరికా ఆంక్షలతో గత నెల రోజులుగా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ బంద్ చేయడంతో ఫిబ్రవరిలో కొనుగోళ్లు ప్రతి రోజుకు 1.04 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయాయి. అలాగే నెల రోజులుగా రష్యా ఆయిల్ ట్యాంకర్లు అరేబియా, బంగాళాఖాతంలోనే ఉన్నాయి.
భారత సముద్ర జలాల్లోనే రష్యా చమురు
భారత్కు డిస్కౌంట్ ధరకు చమురు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా తెలిపింది. ఇప్పటికే భారత సముద్ర జలాల్లో 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు ఉందని, ఇండియాకు క్రూడాయిల్ అందించేందుకు తమ ట్యాంకర్లు రెడీగా ఉన్నాయని తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో డజన్లకొద్దీ తమ దేశ ట్యాంకులు ఉన్నాయని వెల్లడించింది.
