
డెహ్రాడూన్: భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అయితే.. పాకిస్థాన్ గ్లోబల్ టెర్రరిజానికి తండ్రి వంటిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చి దాడులకు ప్రోత్సాహిస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్కు విదేశీ సహాయాన్ని నిలిపివేయాలని కోరారు. పాకిస్తాన్కు నిధులు సమకూర్చడం అంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 10) ఉత్తరాఖాండ్ రాజధాని డెహ్రాడూన్లో జరిగిన జాతీయ భద్రతా సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా భారతదేశ రక్షణ మరియు భద్రతా యంత్రాంగంలో మోడీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత సంస్కరణల గురించి వివరించారు. గడిచిన 11 ఏళ్లలో రక్షణ రంగంలోకి భారత్ బలంగా మారిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన వైఖరి తీసుకుంటుందని పేర్కొన్నారు.
పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత చరిత్రలో ఉగ్రవాదంపై తీసుకున్న అతిపెద్ద చర్యగా ఆయన అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ శాంతి, పురోగతి దశలోకి ప్రవేశించిందని, కానీ పాకిస్తాన్ దానిని అడ్డుకునేందుకు ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిందని ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినప్పటికీ కాశ్మీర్లో అభివృద్ధి ఆగలేదన్నారు. సమాజం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని.. అది ప్రపంచ శాంతి, అభివృద్ధికి తీవ్రమైన ముప్పు అని అన్నారు. భారత రక్షణ బడ్జెట్ 2013–14లో రూ.2.53 లక్షల కోట్ల ఉంటే అది 2024–25లో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. భారతదేశ రక్షణ ఉత్పత్తి రూ.1.30 లక్షల కోట్లకు పెరిగిందని, రక్షణ ఎగుమతులు 2014లో రూ.686 కోట్ల నుంచి ఈ సంవత్సరం రూ.23,622 కోట్లకు చేరుకుందని తెలిపారు.