- 500 మిలియన్ల పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా
- కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియా చేయూత
- మన దేశ అవసరాలు పోను మిగతా స్టాక్ ఎగుమతి
- ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తరలింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వందకుపైగా దేశాలతో ఇండియా మెడికల్ దౌత్యం నడుపుతోంది. కరోనా ట్రీట్మెంట్లో కీలకంగా మారిన హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ను రెండు వారాల నుంచి భారీగా ఇతర దేశాలకు పంపుతోంది. ఇప్పటి వరకూ 85 మిలియన్ల క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను, 500 మిలియన్ల పారిసిటమాల్ ట్యాబ్లెట్లను 108 దేశాలకు పంపినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపాయి. దీనికి అదనంగా ట్యాబ్లెట్ల తయారీలో ఉపయోగించే పారాసిటమాల్ గ్రాన్యూల్స్ను వెయ్యి టన్నుల వరకూ ఎక్స్పోర్ట్ చేసిందన్నారు. ఇప్పటి వరకూ 60 దేశాలకు సంబంధించి 4 వేలకుపైగా ఆర్డర్లు వచ్చాయని, అవన్నీ డిస్పాచ్కు రెడీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఆర్డర్లు డెలివరీ అయ్యాయన్నారు.
ఫ్లైట్లను నిలిపేయడంతో కష్టాలు
అన్ని దేశాలు ఫ్లైట్ సర్వీసులను నిలిపేయడంతో ఇతర దేశాలకు క్లోరోక్విన్ ను ఎగుమతి చేయడం చాలా పెద్ద పనిగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన స్పెషల్ ఫ్లైట్లలో ఈ మందులు, ఇతర వస్తువులను పంపతున్నామని తెలిపారు. ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్న డొమినిక్ రిపబ్లిక్ కు మన క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపాలంటే యూఎస్ ఎవాక్యుయేషన్ ఫ్లైట్లో అట్లాంటాకు.. అక్కడి నుంచి న్యూయార్క్కు.. చివరగా డొమినిక్ రిపబ్లిక్కు గురువారం చేరిందని చెప్పారు. ఇక మారిషస్, సీషెల్స్కు ఇండియా క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఇండియా గిఫ్ట్గా పంపిందని, ఐఏఎఫ్ ప్లేన్లలో ఇవి బుధవారం వెళ్లాయని అన్నారు. ఇక ఆఫ్ఘానిస్థాన్కు పంపాలంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు.
గ్రాంట్గా మిత్ర దేశాలకు
5 మిలియన్ల క్లోరిక్విన్ ట్యాబ్లెట్లను, భారీ మొత్తంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్లను 31 దేశాలకు కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా గ్రాంట్గా సప్లై చేస్తోందని సౌత్ బ్లాక్ వర్గాలు తెలిపాయి. వైరస్ వల్ల తీవ్రంగా ప్రభావం పడిన మన మిత్ర దేశాలకు ముందుగా వీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను సైతం త్వరగా క్లియర్ చేసేందుకు చూస్తున్నామని, ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని తెలిపాయి.
మన అవసరాలకు సరిపడా స్టాక్
ప్రస్తుతం స్పెషల్ ఎకనామిక్ జోన్లలో ఉన్న లేదా ఎక్స్పోర్ట్స్ కోసం కేటాయించిన వంద శాతం డ్రగ్స్ ను ఇతర దేశాలకు సప్లై చేయాలని ఇండియా నిర్ణయించింది. తీవ్రమైన పరిణామాలు ఎదురైనా డొమెస్టిక్ అవసరాలకు సరిపడా డ్రగ్స్ను ఉంచుకుని మిగతా వాటిని ఎగుమతి చేయాలని భావిస్తోంది. కమర్షియల్ కాంట్రాక్టుల్లో భాగంగా ఇప్పటికే ఇండియా అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్ సహా 24 దేశాలకు 80 మిలియన్ల క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఇప్పటికే సప్లై చేసింది. ఇటలీ, స్వీడన్, సింగపూర్ సహా 52 దేశాలకు పెద్ద మొత్తం పారాసిటమాల్ ట్యాబ్లెట్లను ఎగుమతి చేసింది. కొన్ని దేశాలకు రెండు ట్యాబ్లెట్లనూ పంపింది.