
మహిళను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. బెంగళూరు కోర్టు ష్యూరిటీ కింద రూ. 5లక్షల బాండ్, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థల అధికారులకు సహకరించాలని తీర్పులో తెలిపింది. రేవణ్ణ మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు. హసన్లో జరిగిన వరుస లైంగిక వేధింపులపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మే 4న రేవణ్ణను అరెస్టు చేసింది. సిట్ విచారణ అనంతరం రేవణ్ణకు మే 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రేవణ్ణ కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించారని ఆ మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అతనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే ప్రజ్వల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకే మహిళను రేవణ్ణ కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా హాసన్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన ఒక రోజు తర్వాత సెక్స్ స్కాండల్ తెరపైకి వచ్చింది. పలువురు మహిళలను ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా వీడియోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రజ్వల్ రేవణ్ణను జెడీఎస్ సస్పెండ్ చేసింది. వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు.