
ఇండోర్: తొలి రెండు టెస్టుల్లో స్పిన్ ఆయుధంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు సిరీస్తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తుపై కన్నేసింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం ఇండోర్లో మొదలయ్యే మూడో టెస్టులో గెలిచి సొంత గడ్డపై వరుసగా16వ సిరీస్ అందుకోవడంతో పాటు జూన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అవ్వాలని చూస్తోంది. మరోవైపు రెండు మ్యాచ్ల్లోనూ తేలిపోయి, రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ సేవలు కోల్పోయిన ఆసీస్ ఈ టెస్టులో అయినా పుంజుకోవాలని కోరుకుంటోంది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న హోమ్టీమ్ 2–0 ఆధిక్యంతో ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఫామ్లో లేని కేఎల్ రాహుల్, అన్ని ఫార్మాట్లలో జోరుమీదున్న శుభ్మన్ గిల్లో ఎవరిని తుది జట్టులో ఆడించాలనే దానిపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రాహుల్ను నుంచి వైస్ కెప్టెన్సీ తొలగించారు. కానీ, టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచుతోంది. ఇంకో చాన్స్ వస్తే వీలైనన్ని ఎక్కువ రన్స్ చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కేఎల్ కోరుకుంటున్నాడు.
ఇక, స్పిన్నర్ల హవా నడుస్తున్న సిరీస్లో ఇప్పటిదాకా నమోదైన ఏకైక సెంచరీ రోహిత్ శర్మ నుంచి వచ్చింది. అతను జోరు మీదున్నాడు. స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ బాల్తోనే కాకుండా బ్యాట్తోనూ సత్తా చాటుతూ టీమ్ను అత్యంత బలంగా మార్చేశారు. స్పిన్ బౌలింగ్లో స్వీప్ షాట్లతో కంగారూ ప్లేయర్లు బోల్తా కొట్టగా.. ఇండియా బ్యాటర్లు మాత్రం సంప్రదాయ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్తో ఆసీస్ స్పిన్నర్లకు కౌంటర్ ఇచ్చి సక్సెస్ సాధించారు. రోహిత్ తన ఫుట్ వర్క్తో మెప్పిస్తుండగా.. మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. తన వందో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 31 రన్స్ చేసిన పుజారా సైతం కాన్ఫిడెన్స్తో మూడో టెస్టుకు రెడీ అయ్యాడు. ఇండోర్లో భారీ స్కోర్లు చేయాలని కోహ్లీ, పుజారా ఆశిస్తున్నారు. పంత్ గైర్హాజరీలో కీపర్గా వచ్చిన తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడితే అతని కెరీర్కు హెల్ప్ అవుతుంది. ఇక ఇండోర్ హోల్కర్ స్టేడియం పిచ్ను నల్ల మట్టితో తయారు చేశారు. స్పిన్ వికెట్ అయినా అతిగా టర్న్, బౌన్స్ ఉండదు. ఈ నేపథ్యంలో క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్లకు అవకాశం ఉంటుంది. టాస్ నెగ్గితే ఇండియా బ్యాటింగ్ ఎంచుకునే చాన్సుంది. రాహుల్ ప్లేస్లో గిల్ను తీసుకుంటే తప్ప తుది జట్టులో మార్పులుండవు.
ఆసీస్ రేసులోకి వచ్చేనా..
నాగ్పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓటమిని మరిచిపోయేందుకు ఆస్ట్రేలియాకు తగిన సమయం లభించింది. ముఖ్యంగా ఢిల్లీలో కేవలం ఒకే ఒక సెషన్లో విజయాన్ని చేజార్చుకోవడం ఆ టీమ్ను ఎక్కువ బాధించి ఉంటుంది. మూడో టెస్టుకు వచ్చే సరికి ఆసీస్ టీమ్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. తల్లి అనారోగ్యం వల్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. గాయాలతో ఆష్టన్ అగర్, హేజిల్వుడ్, డేవిడ్ వార్నర్ కూడా స్వదేశానికి చేరుకున్నారు. కమిన్స్ ప్లేస్లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్లో పుంజుకోవడం కోసం కంగారూ ప్లేయర్లు చాలా కష్టపడుతున్నారు. ఇండోర్కు వచ్చినప్పటి నుంచి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీలో తమను దెబ్బకొట్టిన స్వీప్ షాట్లకు బదులు అశ్విన్, జడేజా బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్తో ఆడాలని డిసైడయ్యారు. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఖవాజా ఢిల్లీలో 81 రన్స్తో మెప్పించగా, హెడ్ తన దూకుడైన ఆటతో కొద్దిసేపు స్పిన్నర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఇక, కెప్టెన్సీ చేపట్టిన స్మిత్పై భారీ అంచనాలున్నాయి. అతనితో పాటు టెస్టు స్పెషలిస్ట్ లబుషేన్ గాడిలో పడితేనే ఆసీస్ రేసులోకి వస్తుంది. ఆల్ రౌండర్ గ్రీన్తో పాటు సీనియర్ పేసర్ స్టార్క్ గాయాల నుంచి కోలుకొని బరిలోకి దిగబోతున్నారు. ఈ మ్యాచ్లోనూ ఆసీస్ ముగ్గురు స్పిన్నర్లు.. లైయన్, మర్ఫీ, కునెమన్ను కొనసాగించే చాన్సుంది.