విశాఖపట్నం: తొలి రెండు రోజులు చెత్త పెర్ఫామెన్స్ చేసిన సౌతాఫ్రికా నుంచి గొప్ప పోరాటం. బౌలింగ్లో చేతులెత్తేసిన ఆ జట్టు బ్యాటింగ్లో అదరగొట్టింది. అయితే.. తొలి రెండు సెషన్లలో తేలిపోయిన బౌలర్లు.. ఫైనల్ సెషన్లో కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో మూడో రోజు చివరకు ఇండియానే పైచేయి సాధించింది. ఓవర్నైట్ స్కోరు 39/3తో శుక్రవారం ఆట కొనసాగించిన ప్రొటీస్.. ఆట ముగిసేసరికి 118 ఓవర్లలో 8 వికెట్లకు 385 రన్స్ చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 160), వికెట్కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ (163 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 111) అద్భుత సెంచరీలతో సత్తాచాటడంతో సఫారీలు గేమ్లో నిలిచారు. ఫా డుప్లెసిస్ (55) కెప్టెన్ ఇన్నింగ్స్తో కీలకదశలో ఆకట్టుకున్నాడు. అయితే చివరి సెషన్లో అశ్విన్ (5/128) విజృంభించడంతో సఫారీలు వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం టెయిలెండర్లు ముత్తుసామి (12 బ్యాటింగ్), కేశవ్ మహారాజ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 117 పరుగుల వెనుకంజలో ఉన్న సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. మిగతా బౌలర్లలో జడేజాకు రెండు, ఇషాంత్కు ఒక వికెట్ దక్కింది.
ఎల్గర్-డికాక్ సూపర్ భాగస్వామ్యం..
చివరి సెషన్లో అశ్విన్ మెరుపులు మినహాయిస్తే.. మూడో రోజు మొత్తం ఎల్గర్, డికాక్ ఆధిపత్యమే నడిచింది. వీరిద్దరి పోరాటం వల్లే మ్యాచ్పై సౌతాఫ్రికా ఆశలు కోల్పోలేదు. ముఖ్యంగా ఎల్గర్ బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది. తొలి సెషన్ ఆరంభంలోనే టెంబా బవ్యుమా (18)ను ఇషాంత్ ఎల్బీ చేసి షాకివ్వగా.. డుప్లెసిస్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నమోదు చేసిన ఎల్గర్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఉపఖండ పరిస్థితులకు అనుగుణంగా తన టెక్నిక్ను మార్చుకుని గ్రౌండ్కు అన్నివైపులా షాట్లు కొడుతూ పరుగులు రాబట్టాడు. అనూహ్యమైన బౌన్స్తోపాటు తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను ప్రొటీస్ బ్యాట్స్మెన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. 40వ ఓవర్లో తన హాఫ్సెంచరీని పూర్తి చేసుకున్న ఎల్గర్.. అదే ఓవర్లో రెండు సిక్సర్లు, ఒకఫోర్తో గేర్ మార్చాడు. స్పిన్నర్ల బౌలింగ్లో ఇరువురు దూకుడుగా ఆడడంతో లంచ్ టైమ్కు ప్రొటీస్ 153/4తో నిలిచింది. బ్రేక్ నుంచి వచ్చిన కాసేపటికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. దీంతో ఐదో వికెట్కు 115 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డికాక్.. ఎల్గర్కు చక్కని సహకారం అందించాడుఅశ్విన్ బౌలింగ్లో సిక్సర్తో ఎల్గర్ కెరీర్లో 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోఎండ్లో డికాక్ 79 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో టీ విరామానికి ప్రొటీస్ 292/5తో నిలిచింది.
అశ్విన్ మాయ
టీ బ్రేక్ తర్వాత కూడా ఎల్గర్, డికాక్ జోరు పెంచడంతో ఓవర్కు దాదాపు నాలుగు పరుగుల రన్రేట్తో స్కోరుబోర్డు ముందుకు కదిలింది. వీరిద్దరిని ఔట్ చేసేందుకు హనుమ విహారి, రోహిత్ శర్మ సహా ఆరుగురు బౌలర్లను కెప్టెన్ కోహ్లీ మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకుండా పోయింది. అయితే 150 మార్కును దాటి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఎల్గర్ను ఎట్టకేలకు జడేజా ఔట్ చేశాడు. దీంతో 164 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఎల్గర్ వెనుదిరిగినా జోరు తగ్గని డికాక్ కాసేపటికే సిక్సర్తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.ఈ దశలో అశ్విన్ విజృంభించాడు. షార్ప్ టర్నింగ్ బాల్తో డికాక్ను బౌల్డ్ చేసిన అతను కాసేపటికే ఫిలాండర్ (0)ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆఖర్లో ముత్తుసామి, కేశవ్ మహారాజ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
స్కోరుబోర్డు: ఇండియా తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్డ్; సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి)పుజారా (బి) జడేజా 160, మార్క్రమ్ (బి) అశ్విన్ 5, డి బ్రూన్ (సి) సాహా (బి) అశ్విన్ 4, పీట్ (బి) జడేజా 0, బవ్యుమా (ఎల్బీ) ఇషాంత్ 18, డుప్లెసిస్ (సి) పుజారా (బి) అశ్విన్ 55, డికాక్ (బి) అశ్విన్111, ముత్తుసామి (బ్యాటింగ్) 12, ఫిలాండర్ (బి) అశ్విన్ 0, మహారాజ్ (బ్యాటింగ్)3, ఎక్స్ట్రాలు:17; మొత్తం: 118 ఓవర్లలో 385/8
200 వికెట్ల క్లబ్లో జడేజా
ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన జడేజా 200 వికెట్ల క్లబ్లో చేరాడు. కెరీర్లో 44వ మ్యాచ్ ఆడుతున్న జడేజా ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు. 37 మ్యాచ్ల్లో రవిచంద్రన్ అశ్విన్ అందరికంటే వేగంగా ఈ ఘనత సాధించాడు. అలాగే అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన లెఫ్టామ్ బౌలర్గా జడేజా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ (47 మ్యాచ్ల్లో) పేరిట ఉంది.