పహల్గామ్ ఘటనకు ఏడాది.. మృతులకు మోదీ నివాళి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం ముందు భారత్ ఎన్నటికీ తలొంచదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెర్రరిస్టుల కుట్రలు ఎప్పటికీ నెరవేరవని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగి బుధవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు.
తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని అన్నారు. ‘‘ఒక దేశంగా మనం దుఃఖంలోనూ, పట్టుదలలోనూ ఐక్యంగా ఉన్నాం. భారత్ ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదానికైనా తలవంచదు”అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

