టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే...?

టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్  ఫైనల్ చేరాలంటే...?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా..వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుకు చేరువైంది. అయితే  ఇండోర్ లో జరిగిన  మూడో టెస్ట్‌లో  ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలు  భారత జట్టుకు సన్నగిల్లాయి. అటు ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా..భారత్ మాత్రం తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో నాల్గో టెస్టులో గెలుపు భారత్కు కీలకంగా మారింది. 

ఫైనల్ బెర్తు ఖాయం...

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో భాగంగా ఆస్ట్రేలియా 18 టెస్టులు ఆడింది. ఇందులో 11 విజయాలు సాధించి 68.2 పర్సంటేజ్తో నెంబర్ వన్లో నిలిచింది. అటు టీమిండియా 17 మ్యాచుల్లో 10 మాత్రమే గెలిచి 60.29 విన్నింగ్ పర్సంటేజ్తో రెండో స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో శ్రీలంక 10 మ్యాచుల్లో 5 విజయాలతో 53.33 పర్సంటేజ్తో మూడో ప్లేస్లో నిలిచింది. ఈ జట్లలో ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తును కన్ఫార్మ్ చేసుకుంది. మిగిలిన స్థానం కోసం భారత్, శ్రీలంక పోటీపడుతున్నాయి. 

భారత్ ఫైనల్ చేరాలంటే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. అహ్మదాబాద్లో లాస్ట్ టెస్టులో గెలిస్తే 63 పర్సంటేజ్‌ సాధిస్తుంది. దీంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరుకుంటుంది. ఆ మ్యాచులో  ఆస్ట్రేలియా ఓడినా.. 65 శాతంతో నెంబర్ వన్ స్థానంలోనే ఉంటుంది. ఒకవేళ చివరి టెస్టు డ్రా అయితే మాత్రం భారత్కు ఇబ్బందులు తప్పవు.  భారత్ డ్రా చేసుకుంటే 59 పర్సంటేజ్‌తో ఫైనల్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. అదే సమయంలో న్యూజిలాండ్ - శ్రీలంక మధ్య జరిగే రెండు టెస్ట్‌ సిరీస్ ఫలితంపై టీమిండియా  ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

లంకకు అవకాశం 

న్యూజిలాండ్ -శ్రీలంక మధ్య జరిగే రెండు టెస్ట్‌ సిరీస్ను  శ్రీలంక 2-0తో సాధిస్తే 61 పర్సంటేజ్‌తో ఆ జట్టు ఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఈ సిరీస్లో  శ్రీలంక ఒక్క మ్యాచ్లో అయినా ఓడినా భారత్ ఫైనల్ చేరుకుంటుంది. అయితే న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక గెలవడం దాదాపు సాధ్యం కావకపోవచ్చు.  ఎంత శ్రమించినా కివీస్ను వైట్ వాష్ చేయడం లంక తరం కాదు.  కాబట్టి నాల్గో టెస్ట్‌లో భారత జట్టు  గెలిచినా..ఓడినా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌కు ఇబ్బందేమి లేదని చెప్పవచ్చు.