బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో దూరమైన కూడా.. యంగ్ ప్లేయర్లు మాత్రం సూపర్బ్ ఆటతీరుతో భారత్కు అదిరిపోయే గెలుపును అందించారు. టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదో హిస్టారికల్ విక్టరీ అనే చెప్పాలి. శుభ్మన్ గిల్ (91), ఛటేశ్వర్ పుజారా (56) రిషబ్ పంత్ (89 నాటౌట్)ల అద్భుతమైన బ్యాటింగ్తో 328 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించారు.
శుభ్మన్ గిల్ తన క్లాస్ బ్యాటింగ్తో కంగారూ టాప్ బౌలర్ స్టార్క్ను ఓ ఆటాడుకున్నాడు. స్టార్క్ బౌలింగ్లో గిల్ కొట్టిన సిక్స్ మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. ఇక ఐదు వికెట్లు పడ్డాక వాషింగ్టన్ సుందర్ సాయంతో జట్టును పంత్ ఆదుకున్నాడు. తన బ్యాటింగ్ స్టయిల్కు విరుద్ధంగా సింగిల్స్ తీస్తూ, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ పంత్ ఆడిన ఇన్నింగ్స్ వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. స్పిన్నర్ లయన్ బౌలింగ్లో ఔట్ నుంచి తప్పించుకున్న పంత్.. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లకు మరో చాన్స్ ఇవ్వలేదు. అతడికి సుందర్ మంచి సహకారం అందించడంతో భారత్ మర్చిపోలేని విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో పంత్ అరుదైన రికార్డును సాధించాడు. 27 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు చేసిన ఏడో భారత వికెట్ కీపర్గా నిలిచాడు. కాగా, గబ్బా మైదానంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం గత 32 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

