- దానాల్లోనూ మేటి
- రూ.9,713 కోట్లు ఇచ్చిన అజిమ్ ప్రేమ్జీ
- రెండోప్లేసులో శివ్నాడార్
- ముకేశ్ అంబానీకి థర్డ్ ర్యాంకు
న్యూఢిల్లీ: మనదేశంలో చాలా మంది భారీగా డబ్బు సంపాదించడమే కాదు.. అందులో కొంత సమాజానికీ ఇస్తున్నారు. ఇలాంటి దాతలు గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది 31 మార్చి వరకు రూ.14,750 కోట్ల డబ్బును విరాళం చేసి తమ మంచి మనసును చాటుకున్నారు. ‘‘ఎడెల్గివ్ హురన్ ఇండియా ఫిలాంథ్రోపీ లిస్ట్ 2021’’ ప్రకారం సమాజసేవలో విప్రో చీఫ్ అజిమ్ ప్రేమ్జీ నంబర్వన్గా నిలిచారు. దేశంలోనే అత్యున్నత ఉదారవాదిగా వరుసగా రెండోసారి కూడా ప్రేమ్జీ తన పేరును నిలుపుకున్నారు. ఈ ఏడాది ఆయన రూ.9,713 కోట్లను సేవా కార్యక్రమాల కోసం అందజేశారు. హెచ్సీఎల్ చీఫ్ శివ్ నాడార్ రూ.1,263 కోట్ల విరాళంతో రెండోస్థానంలో నిలిచారు. మనదేశంలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ 577 కోట్ల విరాళంతో మూడోప్లేసులో ఉన్నారు. ఎల్ అండ్ టీ మాజీ ఛైర్మన్ ఏఎం నాయక్ రూ. 112 కోట్లను విరాళంగా అందించారు. స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీ జెరోధా ఫౌండర్లు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.25 కోట్లు ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు అక్షయ్ కుమార్ రూ.26 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్లను విరాళంగా అందించారు.
రూ.100 కోట్లకుపైగా...
మొత్తం 11 మంది భారతీయులు రూ.100 కోట్లకు పైబడిన మొత్తాలను విరాళంగా ఇచ్చారు. రూ.50 కోట్లకుపైగా 20 మంది, రూ.20 కోట్లకు పైగా 42 మంది అందించారని తేలింది. హెటిరో డ్రగ్స్ పార్థసారథ రెడ్డి కుటుంబం తమ విరాళాలను 300 శాతం పెంచి రూ.67 కోట్లు ఇచ్చింది. బిగ్ బుల్ రాకేష్ జున్జున్వాలా రూ.50 కోట్లు ఇచ్చారు. ఇన్ఫోసియన్స్ నందన్ నీలేకని రూ.183 కోట్లు, రోహిణి నిలేకని రూ.69 కోట్లు, క్రిష్ గోపాలకృష్ణన్ 50 కోట్లు, శిబులాల్ రూ.35 కోట్లు ఇచ్చారు. చదువు, విపత్తుల నిర్వహణ, తరువాత ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులో ఎక్కువ భాగం ఢిల్లీ, ముంబైలో సేవా కార్యక్రమాలకు వెళ్లింది.