ఆంక్షలున్నా స్విస్ బ్యాంకుల్లోకే భారతీయుల డబ్బు.. ఎందుకంత డిమాండ్!

ఆంక్షలున్నా స్విస్ బ్యాంకుల్లోకే భారతీయుల డబ్బు.. ఎందుకంత డిమాండ్!

చాలా కాలం నుంచే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ దాచబడిన డబ్బంతా బ్లాక్ మనీ అనే వాదన చాలా కాలం నుంచి కొనసాగుతోంది. భారత్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఏకంగా మూడింతలు పెరిగినట్లు తేలింది.

స్విస్ నేషనల్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ దేశ బ్యాంకుల్లో ఉన్న మెుత్తం భారతీయలు డబ్బు రూ.37వేల 600 కోట్లు. 2021 తర్వాత భారతీయ ఖాతాదారుల డబ్బు ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి. నేరుగా ఖాతాల్లో డబ్బు దాచటం కేవలం 11 శాతం మాత్రమే పెరిగిందని తేలింది. దీనికి ముందు 2023లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు భారీగా వెనక్కి తీసుకోబడిన సంగతి తెలిసిందే. 

అయితే ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఉన్న మెుత్తం డబ్బును బ్లాక్ మనీ అనటానికి వీల్లేదు. తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బు మెుత్తాన్ని పన్ను ఎగవేత సొమ్ముగా పరిగణించొద్దని, తాము ఖాతాల వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకుంటున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్రీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న మెుత్తం డబ్బు బ్లాక్ మనీ కాదని అప్పట్లో వెల్లడించారు. 

అయితే ఇప్పటికీ సంపన్నులు ఎక్కువగా స్విస్ బ్యాంకుల్లో తమ డబ్బును దాచుకోవటానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. దీనికి పలు ముఖ్యమైన సమాధానాలు ఉన్నాయి. ముందుగా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ దేశంలో ఆర్థిక అస్థిరతలు, రాజకీయ సంక్షోభాలు వంటివి ఉన్న సమయంలో తమ డబ్బులు అధిక భద్రత కోసం ఇలా స్విస్ బ్యాంకుల్లో దాస్తుంటారు. అక్కడి చట్టాలు అందుకు వెసులుబాటు కల్పించటం, స్విస్ కరెన్సీ కూడా స్థిరంగా ఉండటం, ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు వంటి కారణాలు స్విడ్జర్లాండ్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తోందని తేలింది.