ముంబై: ఇంధన సంక్షోభం, వర్షపాతం తక్కువగా ఉండడంతో 2026–27 లో భారత రియల్ జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోతుందని ఫారిన్ బ్రోకరేజ్ కంపెనీ హెచ్ఎస్బీసీ ఓ రిపోర్ట్లో పేర్కొంది. 2025–26 లో రియల్ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదవుతుందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఫలితంగా ద్రవ్యోల్బణం 5.6 శాతానికి చేరే అవకాశం ఉంది. దీంతో ఆర్బీఐ అక్టోబర్–డిసెంబర్, జనవరి– మార్చి, 2027 లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల పైన కొనసాగుతున్నాయి. చమురు సంస్థలు నష్టాలను తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.7 వరకు పెంచొచ్చు. ఈ సంక్షోభాలు ముఖ్యంగా గ్రామీణ కుటుంబాలు, చిన్న తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
చూపుతాయి.
జీడీపీ వృద్ధి 6.6 శాతం: ఎస్బీఐ
భారత రియల్ జీడీపీ 2026–-27 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధి చెందుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. డాలరుతో రూపాయి విలువ 95 మార్కును దాటిన నేపథ్యంలో, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.04 ట్రిలియన్ డాలర్లకు పడిపోవచ్చని, దీనివల్ల 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం 2029-–30 నాటికి మాత్రమే సాధ్యం అవుతుందని అభిప్రాయపడింది.
