
- మేఘాలయాలో మిస్సయిన ఇండోర్ జంట కేసులో వీడిన మిస్టరీ
- భార్య సహా ఐదుగురు అరెస్టు
షిల్లాంగ్/లక్నో: మేఘాలయాలో మిస్సయిన ఇండోర్ దంపతుల కేసు మిస్టరీ వీడింది. వీళ్లు హనీమూన్ కోసం అక్కడికి వెళ్లగా.. భర్తను భార్య హత్య చేయించినట్టు తేలింది. ఇందుకోసం సుపారీ ఇచ్చింది. నిందితురాలు ఆదివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ కేసు వివరాలను మేఘాలయా డీజీపీ నోంగ్రాంగ్ సోమవారం వెల్లడించారు. ‘‘రాజా రఘువంశీ, సోనమ్ భార్యాభర్తలు. వాళ్లు హనీమూన్ కోసం మేఘాలయాకు వచ్చారు.
ఈ క్రమంలో రఘువంశీ హత్యకు గురయ్యాడు. సోనమ్ ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. తన భర్తను చంపేందుకు సోనమ్నే కాంట్రాక్టు ఇచ్చిందని నిందితులు ఒప్పుకున్నారు” అని డీజీపీ తెలిపారు. కాగా, నిందితులందరూ సోనమ్ కుటుంబానికి చెందిన కంపెనీలో ఎంప్లాయ్స్. వారిలో రాజ్సింగ్ కుశ్వాహ.. సోనమ్ బాయ్ఫ్రెండ్ అని తెలుస్తున్నది. వీళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని, అందుకే రఘువంశీ హత్యకు ప్లాన్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన బిజినెస్మెన్ రాజా రఘువంశీకి అదే సిటీకి చెందిన బిజినెస్మెన్ దేవీసింగ్ రఘువంశీ కుమార్తె సోనమ్తో గత నెల 11న వివాహం జరిగింది. అదే నెల 20న రఘువంశీ, సోనమ్ మేఘాలయాకు హనీమూన్కు వెళ్లారు. 22న స్కూటర్ రెంట్కు తీసుకుని మౌలఖియాట్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోయారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొత్త జంట జాడ కనిపెట్టేందుకు మేఘాలయా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో జూన్ 2న ఓ జలపాతం దగ్గర లోయలో రాజా రఘువంశీ డెడ్బాడీ దొరికింది. అతని గోల్డ్ రింగ్, చైన్ మిస్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత స్పాట్కు దగ్గర్లోనే రక్తపు మరకలు ఉన్న కత్తి, రెయిన్ కోట్ దొరికింది. రఘువంశీ హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు.. ఆయన భార్య సోనమ్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఘాజీపూర్ హైవేపై ఆమె ఉన్నట్టు సమాచారం రావడంతో యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జరిగిందంతా బయటపడింది.
హనీమూన్.. సోనమ్ ప్లాన్: రాజా తల్లి
హనీమూన్కు సోనమ్నే ప్లాన్ చేసిందని రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ తెలిపారు. తన కొడుకును పట్టుబట్టి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఒకవేళ రాజాను సోనమ్నే చంపి ఉంటే, ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా, తన కూతురు సోనమ్ 100 శాతం నిర్దోషి అని ఆమె తండ్రి దేవీసింగ్ రఘువంశీ అన్నారు. ఈ కేసును సీబీఐతో
ఇన్వెస్టిగేట్ చేయించాలని డిమాండ్ చేశారు.
నన్ను కిడ్నాప్ చేశారు: సోనమ్
తాను నిందితురాలిని కాదు బాధితురాలినని విచారణలో సోనమ్ చెప్పినట్టు తెలిసింది. ‘‘నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. యూపీలోని ఘాజీపూర్లో వదిలేసి వెళ్లారు. అక్కడి నుంచే మావాళ్లకు ఫోన్ చేశాను” అని ఆమె చెప్పినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.