
బషీర్బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు, కొత్త చట్టాలు కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్నాయని, వాటిని రద్దు చేసే వరకు పోరాటాలు ఆపబోమని ఐఎన్టీయూసీ జాతీయ, రాష్ట్ర నేతలు హెచ్చరించారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శులు బాబర్ సలీమ్ పాషా, బి.వెంకటేశ్వరరెడ్డి, జాతీయ కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వై.నాగన్న గౌడ్, అదిల్ షరీఫ్, వి.భాస్కర్ రెడ్డి, ఉమా నాగేంద్రమణి మాట్లాడారు.
కాంగ్రెస్కు చెందిన కొంతమంది ఐఎన్టీయూసీ ముసుగు వేసుకొని కార్మిక నాయకులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. తమ పేరును దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, విజయ్ కుమార్ యాదవ్, సోలొమన్ రాజు, సురేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.