ఇక ఐపీఎల్ లో నోబాల్‌‌ అంపైర్!

ఇక ఐపీఎల్ లో నోబాల్‌‌ అంపైర్!

ముంబై : అంపైర్‌‌, లెగ్‌‌ అంపైర్‌‌, థర్డ్‌‌ అంపైర్‌‌, ఫోర్త్‌‌ అంపైర్.. ఇన్నాళ్లుగా క్రికెట్‌‌లో మనకు తెలిసిన అంపైర్లు..! అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ సీజన్‌‌లో ఈ లిస్ట్‌‌లో నోబాల్‌‌ అంపైర్‌‌ కూడా చేరతాడు. అంపైరింగ్‌‌ తప్పులు తగ్గించేందుకు ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ చర్యలు తీసుకుంది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొన్నిసార్లు మ్యాచ్‌‌ ఫలితాన్ని మార్చేస్తున్నాయి. ఉదాహరణకు గత ఐపీఎల్‌‌లో ఆర్‌‌సీబీతో జరిగిన మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ పేసర్‌‌ మలింగ వేసిన నోబాల్‌‌ను అంపైర్‌‌ రవి గుర్తించకపోవడంతో రిజల్ట్‌‌ మారిపోయింది. దీంతో రవిపై బెంగళూరు కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పట్లో ఈ విషయం చాలా చర్చ రేపింది. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలకు చెక్‌‌ పెట్టేందుకు ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ ‘నోబాల్‌‌ అంపైర్‌‌’ను తెరపైకి తెచ్చింది. బ్రిజేశ్‌‌ పటేల్‌‌ నేతృత్వంలో మంగళవారం జరిగిన కౌన్సిల్‌‌ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కౌన్సిల్‌‌లోని ఓ కీలక సభ్యుడు మాట్లాడుతూ..‘ఫ్రంట్‌‌ ఫుట్‌‌ నోబాల్స్‌‌ను గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ అంపైర్‌‌ను పెట్టాలని అనుకుంటున్నాం. ఓ డెలివరీ.. నో బాలా కాదా అని కనిపెట్టడమే అతని పని. ఫీల్డ్‌‌ అంపైర్లు, థర్డ్‌‌ అంపైర్‌‌ను సమన్వయం చేసుకుంటూ అతను పని చేస్తాడు. ఈ నిర్ణయం వింతగా అనిపించవచ్చు. కానీ మేము ఈ అంశంపై  లోతుగా చర్చించాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సీజన్‌‌లో ఈ విధానాన్ని అమలు చేస్తాం. అంతకంటే ముందు డొమెస్టిక్‌‌ టోర్నీల్లో పరీక్షిస్తాం. అంపైరింగ్‌‌ తప్పులు తగ్గించాలనే మేము ప్రయత్నిస్తున్నాం అని’ అన్నారు.

పవర్‌‌ ప్లేయర్‌‌కు నో..విదేశాల్లో ఫ్రెండ్లీస్​కు ఓకే!

క్రికెట్‌‌ ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన ‘పవర్‌‌ ప్లేయర్‌‌’రూల్‌‌ను ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ వాయిదా వేసింది. ముస్తాక్‌‌ అలీ టోర్నీలో పరీక్షించి.. వచ్చే సీజన్‌‌లో ఈ రూల్‌‌ను అమలు చేయాలని భావించారు. కానీ, శుక్రవారం నుంచే టోర్నీ ప్రారంభమవుతుండడంతో తగిన సమయం లేనందున ‘పవర్‌‌ ప్లేయర్‌‌’కాన్సెప్ట్‌‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టారు. అయితే భవిష్యత్తులో కూడా ఈ విధానం పట్టాలెక్కదని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీకి అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలు మినీ ఐపీఎల్​ లేదా విదేశాల్లో ఫ్రెండ్లీ టోర్నీలు ఆడే అంశంపై కూడా గవర్నింగ్​ కౌన్సిల్​ మీటింగ్​లో చర్చ జరిగింది. ఫ్రెండ్లీ టోర్నీలకు సుముఖత తెలిపిన కౌన్సిల్‌‌.. ఇండియాతోపాటు విదేశీ క్రికెటర్ల అందుబాటుపై స్పష్టత వచ్చిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

డిసెంబర్‌‌ 19న కోల్‌‌కతాలో ఐపీఎల్‌‌లో వేలం

ఐపీఎల్‌‌ 13వ సీజన్‌‌కు సంబంధించి డిసెంబర్‌‌ 19న ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇన్నేళ్లుగా బెంగళూరు వేదికగా జరిగిన ఈ వేలాన్ని తొలిసారి కోల్‌‌కతాలో నిర్వహించనున్నారు. ఈ ఆక్షన్‌‌ కోసం ప్రతి ఫ్రాంచైజీకి రూ. 85 కోట్లు చొప్పున కేటాయించారు. గతేడాది కంటే ఇది మూడు కోట్లు ఎక్కువ. గత ఆక్షన్‌‌లో ఫ్రాంచైజీలు మిగిల్చుకున్న డబ్బును ఈసారి వాడుకోవచ్చు.