IRCTC : ఇక రైళ్లల్లో కుక్కలు, పిల్లులను తీసుకెళ్లొచ్చు

IRCTC : ఇక రైళ్లల్లో కుక్కలు, పిల్లులను తీసుకెళ్లొచ్చు

పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేస్తారు. వాటికేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్ళలేరు. ముఖ్యంగా రైలు ప్రయాణ సమయంలో అస్సలు కుదరదు. అటు వదిలి ఉండలేక, తమతో తీసుకెళ్లలేక సతమతమవుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రకటన చేయనుంది.

పెంపుడు కుక్కలు మరియు పిల్లుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రతిపాదనను సిద్ధం చేసింది. తమతో పాటు పెంపుడు జంతువుల కోసం ఇంట్లో ఉండే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇకపై IRCTCలో పెంపుడు జంతువులకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం యజమానులు తమ పెంపుడు జంతువుల కోసం రైళ్లలో 1వ తరగతి AC టిక్కెట్లు, క్యాబిన్‌లను బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది.

ఇది యజమానులకు, ఇతరులకు కాస్త ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పెంపుడు జంతువుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుంది. పెట్స్ మాత్రమే కాకుండా ఆవులు, గేదెలు, గుర్రాలు వంటి వాటిని గూడ్స్ రైళ్లలో  తీసుకెళ్లేలాచర్యలు తీసుకుంటున్నారు. అలాగే వాటిని చూసుకునేందుకు ఒక వ్యక్తి వాటి వెంట ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.