అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • బీఆర్ ఏఎస్ టైంలో ఏపీకి 1,254 టీఎంసీల కృష్ణా నీళ్లు
  • ప్రతి రోజూ 3 టీఎంసీలు తరలించింది  కేసీఆర్
  • రాయలసీమ లిఫ్ట్ తెలంగాణకు మరణశాసనం 
  •  ఆ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలే
  • జగన్ తో అలయ్ బలయ్ చేసుకొని జలదోపిడీకి సహకారం
  • కాళేశ్వరం కట్టకుంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి
  • బనక చర్లతో తెలంగాణకు అన్యాయంపై పోరాడుతం
  • జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ రూల్స్కు విరుద్ధం
  • ఏపీ ఉల్లంఘనలు వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాశాం
  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు అప్పుడు కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724 టీఎంసీలు ఏపీకి వెళ్లాయని, బీఆర్ఎస్ హయాంలో అంతకన్న ఎక్కువగా 1,254 టీఎంసీ లు  కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు తరలించారని ఆరోపించారు. ఇవాళ సెక్రటేరియట్ లో మంత్రి చిట్ చాట్ చేశారు.

 రాయల సీమ లిఫ్ట్ తెలంగాణకు మరణశాసనమని అన్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ప్రతి రోజూ మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సహకరించింది నిజమన్నారు. పదేండ్లు కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేశారని అన్నారు. 

తెలంగాణ వచ్చిన తర్వాతే ముచ్చుమర్రి, మల్యాల కట్టారని ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎక్కువ కృష్ణా జలాలు ఏపీకి తరలిపోయాయని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యే  వరకు తెలంగాణ ప్రభుత్వం కావాలనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లలేదని అన్నారు. జగన్–కేసీఆర్ రహస్య ఒప్పందంలో భాగంగానే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లలేదని ఆరోపించారు. 

జగన్ తో అలయ్ బలయ్ చేసుకొని జల దోపిడీకి సహకరించారని చెప్పారు. బనకచర్ల పై బీ ఆర్ ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బనకచర్ల అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధమని చెప్పారు. దీనిపై పోరాడుతామని స్పష్టం చేశారు. 

 కిషన్ రెడ్డి, బండి  కేంద్రాన్ని ఒప్పించాలె

బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్  కుమార్ రెడ్డి అన్నారు. జీఆర్ఎంబీ( గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు), సీడబ్ల్యూసీ(కేంద్ర జలవనరుల సంఘం), అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు  బనకచర్ల విరుద్ధమని అన్నారు. ఈ ప్రాజెక్టు ఆపాలని కేంద్ర మంత్రి నిర్మాలాసీతారామన్ కు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాసినట్టు చెప్పారు. 

తమకు ఏపీ నుంచి ఎలాటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలూ పరిశీలిస్తామని మే నెలలో పాటిల్ తిరుగు సమాధానం ఇచ్చారని చెప్పారు.  చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్రం .. చట్ట విరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని తాము భావించడం లేదన్నారు. దీనిపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్  రెడ్డి సెంట్రల్ గవర్న్ మెంట్ ను ఒప్పించాలని కోరారు.  

కాళేశ్వరం కట్టకుంటే..

కాళేశ్వరం  ప్రాజెక్టు కట్టకుంటే ఆ ఖర్చులతో కృష్ణా  పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం వల్ల 68 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చయ్యాయని అన్నారు. బనకచర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ రావు అని పేరు మార్చుకుంటే సరిపోతుందని ఫైర్ అయ్యారు. గోబెల్స్ బతికి ఉంటే వీళ్లను చూసి ఆశ్చర్యపోయేవారని అన్నారు.