- అప్లయ్ చేసుకున్న 19 ఐటీ హార్డ్వేర్ కంపెనీలు
- లిస్టులో డెల్, ఫాక్స్కాన్, విస్ట్రాన్ వంటి టాప్ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు 19 కంపెనీలు ప్రభుత్వం వద్ద అప్లికేషన్లు పెట్టుకున్నాయి. తాజాగా ఐటీ హార్డ్వేర్ సెక్టార్కు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ను ప్రభుత్వం విస్తరించింది. ఈ స్కీమ్ కింద బెనిఫిట్స్ పొందేందుకు కంపెనీలు తమ అప్లికేషన్లను సబ్మిట్ చేశాయి. ఇందులో ఎలిజిబులిటీ ఉన్న కంపెనీలకు వచ్చే ఐదేళ్ల వరకు 1–4 శాతం వరకు రాయితీలను ఇస్తారు. ఈ కంపెనీలలో యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్కాన్, విస్ట్రాన్, కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్, లోకల్ మొబైల్ కంపెనీ లావా వంటివి ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్(మెయిటీ) మంగళవారం పేర్కొంది. ఈ స్కీమ్ ద్వారా ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సెక్టార్లో 1.6 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్ జరుగుతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఐటీ హార్డ్వేర్ కంపెనీలు రూ. 1.35 లక్షల కోట్ల ప్రొడక్షన్ కోసం అప్లయ్ చేసుకున్నాయని, ఇందులో లోకల్ కంపెనీల వాటా రూ. 25 వేల కోట్లుగా ఉందని తెలిపింది.
‘ఐటీ హార్డ్వేర్ కేటగిరీ కింద డెల్, ఐసీటీ(విస్ట్రాన్), ఫ్లెక్స్రానిక్స్, రైజింగ్ స్టార్స్ హైటెక్(ఫాక్స్కాన్), లావా కంపెనీలు అప్లికేషన్లు సబ్మిట్ చేశాయి’ అని మెయిటీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. డొమెస్టిక్ కంపెనీల కేటగిరీ కింద మిగిలిన14 కంపెనీలు అప్లయ్ చేశాయని తెలిపింది. ఇందులో డిక్సాన్, ఇన్ఫోపవర్(సహస్రా, మైటాక్ల జాయింట్ వెంచర్), భగవతి(మైక్రోమ్యాక్స్), సిర్మా, ఓర్బిక్, నిలింక్, ఆప్టిమస్, నెట్వెబ్, వివిడీఎన్, స్మైల్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలున్నాయి. ఐటీ హార్డ్వేర్ సెక్టార్ కోసం పీఎల్ఐ స్కీమ్ను ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. గ్లోబల్గా ఇండియాపై నమ్మకం పెరుగుతోందని కేంద్ర ఐటీ మినిస్టర్ పేర్కొన్నారు.