సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి

సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. నివాళులు అర్పించిన  సీఎం చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి

టాలీవుడ్ సూపర్ స్టార్‌ కృష్ణ (1943 మే31) జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ నట వారసుడు హీరో మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ' ఎల్లప్పుడూ నీ వెలుగు ద్వారా మార్గనిర్దేశం చేయబడతాను.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! ఈ రోజు మరియు ప్రతిరోజూ నీ గురించే ఆలోచిస్తున్నాను' అని తండ్రిపై ప్రేమను తెలియజేశారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా నివాళులు తెలిపారు. 'నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి... సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న తెలుగు సినీ కథానాయకుడు, సాహస నిర్మాత కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన సినీరంగానికి, కళామతల్లికి  చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం X వేదికగా కృష్ణ ఫోటో ముందు నివాళులు అర్పించారు. 

'సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా, ఎడిట‌ర్‌గా, స్టూడియో అధినేత‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజ‌కీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు" అని తన పోస్టు పెట్టారు.