
బషీర్బాగ్, వెలుగు: శ్రీజగన్నాథ రథయాత్రను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి, ఇస్కాన్ కూకట్ పల్లి అధ్యక్షుడు ప్రభుజీ మహా శృంగదాస్ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం తెలంగాణ అగర్వాల్ సమాజ్ మాజీ అధ్యక్షుడు అంజనీ కుమార్ అగర్వాల్, గుజరాతి సమాజ్ అధ్యక్షుడు జాస్మాత్ పటేల్, ఇస్కాన్ కూకట్ పల్లి సమన్వయకర్త ఎం.శ్రీవాణి, ఇస్కాన్ రష్యా ప్రతినిధి ఒక్సానాతో కలిసి రథయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు.
మధ్యాహ్నం హైదర్ నగర్ మైసమ్మ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభమై.. నిజాంపేట్, జేఎన్ టీయూ, బాలానగర్ మెట్రో స్టేషన్ మీదుగా వెళ్లి రాత్రి మెట్రో గార్డెన్ వద్ద ముగుస్తుందని వెల్లడించారు. లక్ష మందికి పైగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఆరకపూడి గాంధీ, మాధవరం కృష్ణరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ హాజరుకానున్నట్లు తెలిపారు.