అవినీతిపరుల్ని కాల్చిచంపాలన్న కామెంట్స్పై జమ్మూ కశ్మీర్ గవర్నర్ వివరణ
శ్రీనగర్: అమాయకులైన ప్రజల్ని కాకుండా అవినీతిపరుల్ని కాల్చిచంపాలంటూ టెర్రరిస్టుల్ని ఉద్దేశించి జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో …తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అలా మాట్లాడానని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ తాను అలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాల్సిందని ఒప్పుకున్నారు. ‘‘ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. అవినీతిపై నేను చేసిన కామెంట్స్ నా ఫీలింగ్స్ మాత్రమే. గవర్నర్ను కాకపోయి ఉంటే కచ్చితంగా నేను అలాగే మాట్లాడేవాణ్ని ’’ అని మాలిక్ సోమవారం టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలీ క్లారిటీ ఇచ్చారు. లడఖ్లోని కార్గిల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అవినీతిపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.‘‘ తుపాకులు పట్టిన కుర్రాళ్లు (టెర్రరిస్టులు) సొంత ప్రజల్నే చంపుతున్నారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను కాల్చిచంపుతున్నారు. వాళ్లనెందుకు మీరు చంపుతున్నారు? కాశ్మీర్ సంపదను దోచుకున్న వాళ్లను మీరు (తుపాకులు పట్టిన యూత్) ఎందుకు చంపరు? ఇలాంటి వాళ్లను ఎప్పుడైనా చంపారా?’’ అని మాలిక్ ప్రశ్నించారు.
ఒమర్ అబ్దుల్లా ఫైర్
మాలిక్ కామెంట్స్పై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గవర్నర్ అవినీతి అధికారుల్ని, నేతల్ని చంపమని ఎలా చెబుతారంటూ అబ్దుల్లా ట్వీట్లో ప్రశ్నించారు. అబ్దుల్లా ట్వీట్పై గవర్నర్ కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అబ్దుల్లా రాజకీయాల్లో కుర్రకుంక అని, ప్రతి ఇష్యూపైనా ట్వీట్ చేస్తుంటారని మాలిక్ మండిపడ్డారు. తాను ఇక్కడి నుంచి వెళ్లే లోపు వాళ్ల అవినీతిని బట్టబయలు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.