- ఫిరంగి నాలా ఆక్రమించి కట్టారంటున్న
- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- ఈడీ బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీ భూమి ఎలా రిలీజైంది?
- ట్రెస్పాస్ బోర్డుతో లోపలికి అనుమతించని పోలీసులు
- కరెంట్ బిల్లు కూడా శతభిష కంపెనీనే కడుతోందన్న ఎంపీలు
- కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడన్న ఓనర్ ప్రదీప్ రెడ్డి
- బీఆర్ఎస్ శ్రేణుల అడ్డగింతతో కొద్దిసేపు ఉద్రిక్తత
చేవెళ్ల, వెలుగు: జన్వాడ ఫాంహౌస్ సత్యం రామలింగరాజుకు చెందిన శతభిష కంపెనీ భూముల్లో నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. 111జీవో పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఫిరంగి నాలాను ఆక్రమించి కట్టారని, దీనిపై హైడ్రా జులైలో నోటీసులు ఇచ్చినా ఓనర్ రిప్లై ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం శనివారం ప్రజాభవన్ నుంచి ప్రత్యేక బస్సులో నార్సింగి మున్సిపల్ పరిధిలోని జన్వాడ ఫాంహౌస్ వద్దకు వెళ్లారు.
అయితే ఓనర్ 'ప్రైవేటు ప్రాపర్టీ ట్రెస్పాస్ చేస్తే చర్యలు' అని బోర్డు పెట్టడంతో పోలీసులు కాంగ్రెస్ బృందాన్ని లోపలికి అనుమతించలేదు. చేసేది లేక ఫిరంగి నాలాతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కేసులో ఈడీ శతభిష కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టి, దానికి సంబంధించిన భూములు, షేర్లను అటాచ్ చేసిందని చెప్పారు. ఈ వ్యవహారంపై ఐటీ ట్రిబ్యునల్ కోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తోందన్నారు.
కానీ జన్వాడ రెవెన్యూలోని సర్వే నంబర్లు 301, 311, 313లో ఉన్న 13 ఎకరాల భూమిని మాత్రం 2014–15లో రిలీజ్ చేశారని చెప్పారు. అది కూడా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ముందు డీఎన్బీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి, తర్వాత సత్యం రామలింగరాజు కుమారుడికి అత్యంత సన్నిహితుడైన డి రాజేశ్కు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఇతని నుంచి ప్రదీప్రెడ్డికి బదిలీ అయ్యిందని వెల్లడించారు. ప్రస్తుతం 301 సర్వే నంబర్లో 3.02 ఎకరాల భూమి కేటీఆర్ సతీమణి శైలిమ పేరుపై, 18 గుంటల భూమి కేటీఆర్ అత్త పాకాల శశిరేఖ పేరు మీద ఉందన్నారు. ప్రదీప్రెడ్డి కేటీఆర్కు చిన్నప్పటి స్నేహితుడే కావొచ్చు గానీ, ఆ భూములు అతనికి ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈడీ అటాచ్ మెంట్లో భూములు
శతభిష కంపెనీకి సంబంధించిన భూములు, షేర్లు ఇంకా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయని, 13 ఎకరాలు మాత్రమే ఎలా రిలీజ్ అయ్యాయని నిలదీశారు. దీనిపై ఐటీ, ఈడీ అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ వ్యవహారాలు కేంద్రం పరిధిలోనే ఉన్నందున కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలని కోరారు. గతంలో డ్రోన్ ఎగరేసిన వ్యవహారంలో రేవంత్రెడ్డిపై కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేసిన ఆయన, ఫాంహౌస్ పత్రాలు బయటపెట్టాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. ప్రైవేట్ భూముల్లోకి రావాలనే ఉద్దేశం తమకు లేదని, కేసీఆర్ కుటుంబం దోపిడీని ప్రజలకు తెలియజేయాలనే వచ్చామన్నారు.
నిన్న హరీశ్రావు, ఈ రోజు కేటీఆర్ బాగోతం చూపించామని, రేపు మరొకరిది చూపిస్తామని స్పష్టం చేశారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జన్వాడ ఫాంహౌస్ ఫిరంగి నాలాపై కట్టారని, పంచాయతీ నుంచి గానీ, జీహెచ్ఎంసీ నుంచి గానీ ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని ఆరోపించారు. ఫాంహౌస్ కరెంట్ బిల్లు సైతం శతభిష కంపెనీ మీద సూర్యనారాయణ రాజు పేరుపై ఇప్పటికే చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ బృందంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, కడియం కావ్య, విప్లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, మండలిలో విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీ గణేశ్ తదితరులు ఉన్నారు.
నోటీసులు ఇస్తే పత్రాలు చూపిస్తా: ప్రదీప్రెడ్డి
తనకు నోటీసులు ఇస్తే ఫాంహౌస్కు సంబంధించిన పత్రాలు చూపించేందుకు సిద్ధమని ఓనర్ ప్రదీప్రెడ్డి తేల్చిచెప్పారు. శనివారం కాంగ్రెస్ బృందం ఫాంహౌస్కు వచ్చేముందే చేవెళ్ల జోన్ డీసీపీ యోగేశ్ గౌతమ్ ప్రదీప్రెడ్డితో చర్చించారు. తాను 2019లో చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, క్లియర్ టైటిల్ ఉందని తెలిపారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడని, ఫాంహౌస్ను ఆయనకు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు.
