న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్కు ఎదురు దెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకోలేకపోయిన టీమిండియా స్టార్ పేసర్ ఐపీఎల్ కు దూరం అవుతున్నాడు. బుమ్రా ఆరు నెలల దాకా రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దాంతో, జూన్లో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు కూడా దూరం అవుతున్నాడు. అక్టోబర్–నవంబర్లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్కప్లో ఆడటంపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో కూడా ఆడని బుమ్రా వెన్ను గాయానికి సర్జరీ అవసరమా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ‘బుమ్రా తిరిగి రావడానికి మరో ఆరు నెలలు పడుతుంది. కాబట్టి ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. వన్డే వరల్డ్ కప్ నాటికి రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నాం. కానీ, దానికీ గ్యారెంటీ లేదు’ అని బోర్డు వర్గాలు చెప్పాయి. 29 ఏళ్ల బుమ్రా 2022లో ఐపీఎల్ కాకుండా కేవలం ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, మరో ఐదు టీ20ల్లో మాత్రమే పాల్గొన్నాడు.