నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా : జనంపల్లి అనిరుధ్​రెడ్డి

నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా : జనంపల్లి అనిరుధ్​రెడ్డి

జడ్చర్ల టౌన్/నవాబుపేట, వెలుగు: నిరుపేద విద్యార్థులందరికీ అండగా ఉంటానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని బాలుర, బాలికల జూనియర్​ కాలేజీలతో పాటు నవాబుపేట మండలం యన్మన్​గండ్ల  జూనియర్​ కాలేజీలో తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని స్టూడెంట్స్​ అంతా శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 1,300 మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

 నిరుపేద విద్యార్థులు వారి కుటుంబ పరిస్థితులు సరిగా లేక మధ్యాహ్న భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాలేజీల డెవలప్​మెంట్  కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని గవర్నమెంట్​ కాలేజీల్లో చదువుతున్న 100 మందిని ఎంపిక చేసి వారి ఉన్నత చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. ఫర్నిచర్​ సమకూరుస్తానని హామీ ఇచ్చారు.