- 9 శాతం పడ్డ కల్యాణ్ జ్యువెలర్స్ షేర్లు
- లోకల్గా ఉన్న గోల్డ్ను సేకరించి, రీసైక్లింగ్ చేయాలన్న ఏఐజేజీఎఫ్
ముంబై: బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని మోదీ పిలుపివ్వడంతో జ్యువెలరీ కంపెనీల షేర్లు సోమవారం భారీగా పడ్డాయి. డిమాండ్ పడిపోతుందనే ఆందోళనలు పెరిగాయి. కల్యాణ్ జ్యువెలర్స్ షేరు అత్యధికంగా 9.23 శాతం పతనమైంది. సెన్కో గోల్డ్ 8.61 శాతం, టీబీజెడ్ 7.52 శాతం మేర నష్టపోయాయి. టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ కంపెనీ 6.83 శాతం పడిపోగా, స్కై గోల్డ్, తంగమయిల్ జ్యువెలరీ, పీసీ జ్యువెలర్ షేర్లు కూడా 4 నుంచి 6 శాతం వరకు క్షీణించాయి.
- వ్యాపారాలపై ప్రభావం..
భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం కారణంగా లాంగ్టర్మ్లో డిమాండ్ మారకపోయినా, స్వల్పకాలంలో మాత్రం జ్యువెలరీ వ్యాపారాలపై ఈ ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెళ్లిళ్ల సమయంలో కూడా బంగారం కొనుగోళ్లను నివారించాలని ప్రధాని కోరడంతో డిమాండ్ తగ్గుతుందని తెలిపాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇలాంటి టైమ్లో బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా ఫారెక్స్ నిల్వలను కొంత మేర ఆదా చేయడానికి వీలుంటుంది. మే 1తో ముగిసిన వారానికి భారత్ విదేశీ మారక నిల్వలు 7.794 బిలియన్ డాలర్లు తగ్గి 690.693 బిలియన్ డాలర్లకు చేరాయి.
- ప్రమాదంలో 3.5 కోట్ల మంది ఉపాధి
ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని చేసిన విజ్ఞప్తిపై ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) స్పందించింది. కేవలం కొనుగోళ్లను వాయిదా వేయడం కంటే, దేశీయంగా ఉన్న బంగారాన్ని మానిటైజేషన్ స్కీమ్ల ద్వారా సేకరించి రీసైక్లింగ్ చేస్తే ఫారెక్స్ నిల్వలను ఆదా చేయొచ్చని తెలిపింది. కొనుగోళ్లు పడిపోతే ఈ రంగంపై ఆధారపడిన 3.5 కోట్ల మంది ప్రజల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఫెడరేషన్ హెచ్చరించింది.
‘‘డిమాండ్ను తగ్గించడం కంటే, భారతీయుల వద్ద 'ఖాళీగా' పడివున్న బంగారాన్ని సేకరించడం, రీసైక్లింగ్ చేయడం, తిరిగి ప్రొడక్షన్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి” అని సూచించింది. బంగారాన్ని సేకరించడానికి, నియంత్రించడానికి ఒక ప్రత్యేక 'బులియన్ బ్యాంక్'ను ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఏడాదికి 200–-300 టన్నుల దిగుమతి భారం తగ్గుతుందని అంచనా వేసింది.
- సెన్సెక్స్ 1,300 పాయింట్లు క్రాష్
అమెరికా–-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,313 పాయింట్లు (1.70శాతం) పతనమై 76,015 వద్ద ముగియగా, నిఫ్టీ 360 పాయింట్లు (1.49శాతం) తగ్గి 23,815 వద్ద స్థిరపడింది. బ్రెంట్ క్రూడ్ ధర 2.23 శాతం పెరిగి 103.5 డాలర్లకు చేరింది.
రూపాయి@ 95.28
బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి నికరంగా రూ.8,400 కోట్ల విలువైన షేర్లను అమ్మడంతో సోమవారం రూపాయిపై ఒత్తిడి పెరిగింది. డాలర్తో 79 పైసలు క్షీణించి 95.28 వద్ద ఆల్టైమ్ కనిష్ట స్థాయిని తాకింది.
