Jio Financial: అంబానీకి సెబీ గ్రీన్ సిగ్నల్.. మ్యూచువల్ ఫండ్ బిజినెస్ షురూ..

Jio Financial: అంబానీకి సెబీ గ్రీన్ సిగ్నల్.. మ్యూచువల్ ఫండ్ బిజినెస్ షురూ..

Jio Mutual Funds: కొన్ని నెలల కింద రిలయన్స్ నుంచి ప్రత్యేక వ్యాపార సంస్థగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను అంబానీ వేరుచేశారు. అయితే ఆ తర్వాత జియో అమెరికాకు చెందిన బ్లాక్ రాక్ సంస్థతో కలిసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని సమాన వాటాలతో ప్రారంభించింది. అయితే తాజాగా దీనికి మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ నుంచి మ్యూచువల్ ఫండ్ వ్యాపారం స్టార్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

వాస్తవానికి అసెట్ మేనేజ్మెంట్ రంగంలో భారీ అనుభవం కలిగిన బ్లాక్ రాక్ అంబానీతో జతకట్టడం ద్వారా రిటైల్, ఇన్టిట్యుషనల్ ఇన్వెస్టర్లకు ప్రస్తుతం సేవలను అందించటానికి సిద్ధమౌతోందని తెలుస్తోంది. ఈ రెండు తమకు ఉన్న అనుభవంతో స్థానిక ప్రజలకు గ్లోబల్ అనుభవాన్ని రంగరించి సేవలను అందిచనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా తక్కువ ఖర్చులో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

గడచిన కొన్ని త్రైమాసికాలుగా భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం భారీగా పుంజుకుని జోరుమీద ఉన్న సమయంలో అంబానీ ఈ రంగంలోకి అడుగుపెట్టడం గమనార్హం. ఇన్వెస్టర్లు సాంప్రదాయ పెట్టుబడి విధానాల నుంచి కొత్తతరం పెట్టుబడి సాధనాలకు మారుతున్న క్రమంలో రిలయన్స్ తన ఆటను స్టార్ట్ చేసింది. అలాగే ఈ సంస్థ బ్లాక్ రాక్ కి చెందిన అల్లాడిన్ టెక్నాలజీని ఉపయోగించి మంచి పెట్టుబడి ఎంపికలతో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టొచ్చని తెలుస్తోంది.

►ALSO READ | IT News: టెక్కీలూ హీరోల్లా అస్సలు ఫీలవ్వొద్దు.. ఆరోగ్యం షెడ్డుకెల్లుద్ది.. హెల్త్ వార్నింగ్ రగడ..

బ్లాక్ రాక్ కంపెనీతో కలిసి ముందుకెళ్లటం ద్వారా తాము పెట్టుబడిదారులకు తేలికైన, సులువైన, అందుబాటులో ఉండే పెట్టుబడి ఎంపికలను భారతీయులకు చేరువచేయాలని నిర్ణయించినట్లు ఇషా అంబానీ వెల్లడించారు. అలాగే కంపెనీకి సీఈవోగా సిద్ స్వామినాథన్ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ రాక్ సంస్థకు చెందిన అనేక ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు. మెుత్తానికి సెబీ గ్రీన్ సిగ్నల్ తో రానున్న కొన్ని నెలల్లోనే జియో ఫైనాన్షియల్ సంస్థ నుంచి కొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రానున్నాయి. ఇది మ్యూచువల్ ఫండ్ రంగంలో కొత్త పోటీకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సెబీ అనుమతులతో జియో ఫైనాన్షియల్ స్టాక్ ఇంట్రాడేలో 3 శాతం మేర నేడు లాభపడింది.