హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కరోనా టైంలో పాస్లను రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. తర్వాత దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం కె.కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ.. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీతో పాస్లు ఇవ్వాలని కోరారు. ఐదేండ్లుగా జర్నలిస్టులు రైల్వే పాసులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విధి నిర్వహణలో స్థానిక ప్రయాణాలతోపాటు దేశీయంగా కూడా సమస్యలు తప్పడం లేదన్నారు.
జర్నలిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఒకే ఒక్క పథకాన్ని కూడా రద్దు చేసి చేతులు ఎత్తేసిందన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శి ఈ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కృష్ణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
