
ప్రతి హీరో తన కెరీర్లో ఒకసారో, అంతకంటే ఎక్కువసార్లో డ్యూయెల్ రోల్ చేస్తాడు. ఎన్టీఆర్ కూడా ఇప్పటికే చేశాడు. ఇప్పుడు మరోసారి ఇద్దరిగా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో నటిస్తున్న ఎన్టీఆర్, నెక్స్ట్ మూవీ ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో చేయబోతున్నాడు. ఇందులో తను రెండు పాత్రల్లో కనిపిస్తాడట. వాటిలో ఒకటి నెగిటివ్ రోల్ అంటున్నారు. అంటే అతనే హీరో, అతనే విలన్ అన్నమాట. ప్రశాంత్ నీల్ సినిమా అంటే భారీ యాక్షన్ ఎంటర్టైనరే అయ్యుంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ హీరోని ఏ స్థాయిలో చూపిస్తాడో, విలన్ని కూడా అంతే బలంగా చూపించడం అతని స్టైల్. మరి ఆ రెండు పాత్రల్లోనూ ఎన్టీఆరే కనిపిస్తాడంటే వాటిని ఏ రేంజ్లో డిజైన్ చేస్తాడో ఊహించవచ్చు. ఆల్రెడీ రిలీజైన లుక్ కూడా కాస్త నెగిటివ్ షేడ్లోనే ఉండడాన్ని బట్టి ఇది నిజమనిపిస్తోంది. విలనీని ప్రదర్శించడం ఎన్టీఆర్కి కొత్తేమీ కాదు. ఇప్పటికే ‘జై లవకుశ’ సినిమాలో అలాంటి క్యారెక్టర్లో అదరగొట్టాడు. ఇక ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు దొరికితే తన పర్ఫార్మెన్స్ పతాక స్థాయికి చేరడం ఖాయమన్నట్టే!